చేవెళ్లటౌన్, జూలై 4 : హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉపాధి హామీ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి, మండలంలోని 37 పంచాయతీల్లో మొక్కలు పెంచారు. ఒక్కో పంచాయతీలోని నర్సరీలో 18వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. 37 గ్రామపంచాయల్లోని నర్సరీల్లో 6లక్షల 66వేల మొక్కలను మొక్కలను పెంచుతున్నారు. ఉపాధి హామీ కింద న్యాలట, ఎన్కెపల్లి, తలారం, గుండాల, కందవాడ, దేవరంపల్లి, తంగడిపల్లి, ఆలూర్, అంతారం, అల్లవాడ, మల్కాపూర్, ఖానాపూర్, గొల్లగూడ, ఊరెళ్లల, కుమ్మెర, నాన్చేర్, కేసారం, చేవెళ్ల గ్రామాలతో పాటు మిగతా గ్రామాల్లోనూ మొక్కలు రెడీగా ఉన్నాయి.
ఈజీఎస్ ద్వారా 40 శాతం పండ్లు, కానుగ, 60 శాతం టేకు, మునగ, కొనపరపాసు, చింత, వేప, జాస్విన్, చైనా బాదం తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. నారు, గింజల, స్టమ్స్ ద్వారా కవర్లలో మొక్కల పెంపకం వల్ల ప్రతి గ్రామానికి చెందిన 25 నుంచి 30 మంది కూలీలకు ఉపాధి లభిస్తున్నది. వనసేవకులు, ఈజీఎస్ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు నర్సరీల నిర్వహణ బాధ్యత చూస్తున్నారు. నర్సరీలను డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ దిలీప్కుమార్, (సీవో జిల్లా పరిషత్), ఎంపీడీవో రాజ్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో..
హరితహారాన్ని విజయవంతమయ్యేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తాం. పొలాలు, రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటుతాం.
– రాజ్ కుమార్, ఎంపీడీవో
మొక్కలను సిద్ధం చేశాం..
నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మండలంలో 6 లక్షలకుపైగా మొక్కలను అందుబాటులో ఉంచాం. ఉపాధి హామీతో పాటు ప్రజలను భాగస్వాములను చేయిస్తాం.
– రాజశేఖర్, చేవెళ్ల మండల ఇన్చార్జి ఏపీవో
ప్రతి మొక్కను సంరక్షిస్తాం..
హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తాం. ట్రీ గార్డుల ఏర్పాటుతో పాటు నిత్యం పర్యవేక్షిస్తాం. గ్రామంలో 18వేలకు పైగా మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
– బండారి శైలజ ఆగిరెడ్డి, చేవెళ్ల సర్పంచ్