కొత్తూరు రూరల్, జూలై 4 : ప్రమాదవశాత్తు క్వారీలో పడి బాలుడు గల్లంతైన సంఘటన కొత్తూరు మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం.. కొత్తూరు మండలపరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన పాత్లావత్ చందు(16) కడ్తాల్ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో చందు కొన్ని రోజులుగా తల్లిదండ్రులతోపాటుగా ఇన్ముల్నర్వ గ్రామంలోనే ఉంటున్నాడు. గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వెనుక గల క్వారీ వద్ద చందు మేకలను మేపుతుండగా.. ప్రమాదవశాత్తు చందు కాలు జారి క్వారీ నీటి గుంతలో పడిపోయాడు.
క్వారీలో పడిపోవడాన్ని గమనించిన చందు మామ గోపి చందు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారాన్ని అందించాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ఫైర్, డీఆర్ఎఫ్ టీంలతో గాలింపు చర్యలను చేపట్టారు. బాలుడి తండ్రి శివ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక బాలుడు ఆత్మహత్యకు యత్నించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలుడు క్వారీలో పడిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఇన్ముల్నర్వ గ్రామంలో గల క్వారీ వద్దకు చేరుకుని పరిశీలించారు. చందు కుటుంబసభ్యులను అడిగి సంఘటన వివరాలను తెలసుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ అజయ్నాయక్, ఉపసర్పంచ్ శ్రీరాములుయాదవ్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు యాదగిరి, నాయకులు లింగంనాయక్, గోపాల్నాయక్, శంకర్నాయక్ పాల్గొన్నారు.