వికారాబాద్, జూలై 3 : మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం తక్షణ వైద్యం అందేలా రాష్ట్ర సర్కారు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. వికారాబాద్ జిల్లాకు రెండు బస్తీ దవాఖానలు మంజూరు కాగా, మద్గుల్ చిట్టంపల్లి బస్తీ దవాఖానలో వైద్య సేవలందుతున్నాయి. తాండూరు బస్తీ దవాఖాన ఏర్పాటు పనులు తుది దశకు చేరాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ దవాఖానల్లో తక్షణమే వైద్యంతో పాటు ఉచితంగా మందులను అందజేయనున్నారు. అంతేకాకుండా వానకాలం సీజనల్ వ్యాధులపై సిబ్బంది కాలనీలవాసులకు అవగాహన కల్పించనున్నారు. ఈ దవాఖానల్లో డాక్టర్, ఏఎన్ఎం, ముగ్గురు ఆశవర్కర్లు అందుబాటులో ఉండనున్నారు. అనారోగ్యానికి గురైతే దూర ప్రాంతాల్లోఉండే ఏరియా దవాఖానకు వెళ్లే బాధలు తప్పాయని కాలనీల్లోని జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. ప్రజలకు చికిత్సలు చేసేందుకు వైద్యులు, సరిపడా మందులను అందుబాటులో ఉంచింది. వికారాబాద్ జిల్లాకు 2 బస్తీ దవాఖానలు మంజూరు అయ్యాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి, మరొక్కటి తాండూరులో బస్తీ దవాఖానలను జిల్లా వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. మద్గుల్చిట్టంపల్లిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన రోగులకు అందుబాటులోకి వచ్చింది. తాండూరులోని బస్తీ దవాఖాన ఏర్పాటుకు పనులను పూర్తి చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వైద్యాధికారుల ప్రోత్సాహంతో బస్తీ దవాఖానను అన్ని విధాలా సిద్ధం చేస్తున్నారు.
జిల్లా వైద్యుల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధమయ్యారు. ఏ చిన్న రోగం వచ్చినా ప్రజలు వికారాబాద్, తాండూరులోని దవాఖానలకు రావాల్సిందే. బస్తీ దవాఖానలను (పేద ప్రజలకు వైద్యం అందని ప్రాంతాల్లో) ఏర్పాటు చేయడంతో ఎంతో మంది ప్రజలకు సులభంగా మారింది. ఇందులో ఒక డాక్టర్, ఏఎన్ఎం, ముగ్గురు ఆశవర్కర్లు ఉంటారు. ఇక్కడ బీపీ, షుగర్, కరోనా వంటి పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తున్నారు.
ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మద్గుల్ చిట్టంపల్లితో పాటు గుడుపల్లి, టేకులబీడు తండాల ప్రజలు సైతం బస్తీ దవాఖానలకు వస్తుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉండగా, రోజుకు 30 మందికి పైగా రోగులు వచ్చి వివిధ రకాల పరీక్షలు చేయించుకుంటున్నారు. 2 సంవత్సరాలు పైబడిన చిన్నారులకు సైతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇవే కాక వైద్యులు, సిబ్బంది వారానికి ఒక రోజు కాలనీల్లో తిరిగి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. బస్తీ దవాఖానను ఏర్పాటు చేయడంతో చాలా మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో మందులు
ఏరియాదవాఖానల మాదిరిగా బస్తీ దవాఖానల్లోనూ మందులు సిద్ధంగా ఉన్నాయి. అనంతగిరి డీఎంహెచ్వో కార్యాలయంలోని మెడిసిన్ను, సిద్ధులూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అవసరమగు మందులను వైద్యులు తీసుకొస్తారు. జలుబు, జ్వరం, దగ్గు, తదితర మాత్రలు, మందులు అందుబాటులో ఉన్నాయి. దవాఖానకు వచ్చిన రోగులకు వైద్యుల సూచనల మేరకు వైద్య పరీక్షలు చేస్తారు.
మారుమూల ప్రాంతాల వారికి మేలు
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో వోపీలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లభించే చికిత్సలు అందిస్తున్నాం. వికారాబాద్ నుంచి బస్తీ దవాఖానలకు మందులు, మాత్రలు సరఫరా చేస్తున్నాం.
– తుకారాం, డీఎంహెచ్వో, వికారాబాద్
దవాఖాన ఏర్పాటు సంతోషకరం
మా ఊరి వాళ్లకు ఎలాంటి రోగాలు వచ్చినా వికారాబాద్ ఏరియా దవాఖానకు వెళ్లాల్సి వచ్చేది. దవాఖానకు వెళ్లి రావాలంటే ఒక రోజు సమయం పట్టేది. ప్రస్తుతం ప్రభుత్వం బస్తీ దవాఖానను ఏర్పాటు చేయడంతో సులువుగా దవాఖానకు వెళ్లొస్తున్నాం. వైద్యులతో రోగానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించి సూచనలు తీసుకుంటున్నాం. మారుమూల ప్రాంతమైన మద్గుల్ చిట్టంపల్లిలో బస్తీ దవాఖాన ఏర్పాటుతో ఎంతో మందికి మెరుగైన వైద్యం అందనున్నది.
– మల్లారెడ్డి, మద్గుల్చిట్టంపల్లి, వికారాబాద్
రోగులకు అందుబాటులో ఉంటున్నాం..
మద్గుల్చిట్టంపల్లితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు సైతం బస్తీ దవాఖానకు వస్తున్నారు. వచ్చిన వారికి సరైన విధంగా పరీక్షలు చేసి, మందులను ఇస్తున్నాం. ప్రతి శుక్రవారం కాలనీలో తిరిగి నీటి నిలువలు ఉండకుండా జాగ్రత్తలు తెలియజేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మాదిరిగా సదుపాయాలు కల్పిస్తున్నాం. బస్తీ దవాఖానను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం.
– ప్రవీణ్కుమార్, వైద్యుడు, బస్తీ దవాఖాన మద్గుల్ చిట్టంపల్లి