కులకచర్ల, జూలై 2: కులకచర్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగలు సినీఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. కులకచర్ల గ్రామానికి చెందిన జ్యోగు అంజయ్య తన కుటుంబంతో కలిసి కాళమ్మ ఆలయం వద్ద ఉన్న తన పొలంలో ఇంటిని నిర్మించుకుని అక్కడే ఉంటున్నాడు. కాగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అంజయ్య, అతడి భార్య అలివేలు కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా నలుగురు దొంగలు ముఖాలకు మాస్కులు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడి గన్తో బెదిరించి అలివేలు మెడలో ఉన్న మూడు తులాల బంగారం, బీరువాలో ఉన్న మరికొంత బంగారాన్ని తీసుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న కులకచర్ల పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీంతో పరిసరాలను పరిశీలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కోటిరెడ్డి
జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి బాధితులు అంజయ్య, అలివేలుతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన కులకచర్ల పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాళమ్మ ఆలయం వద్ద జరిగిన చోరీని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా త్వరలోనే ఛేదిస్తామన్నారు. ఈ చోరీలో నలుగురు పాల్గొన్నట్లు, వారు మారణాయు ధాలను వాడారని, బెదిరించి బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, రశీదు, వెంకటరామయ్య, కులకచర్ల ఎస్ఐ గిరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.