బొంరాస్పేట, జూన్ 26: మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహ దారి విస్తరణ పనులు ఇప్పటికే పూర్తికాగా తుంకిమెట్ల గ్రామంలో రహదారి విస్తరణ వల్ల నివాస గృహాలకు నష్టం జరుగుతుందని కొందరు రోడ్డు పనులను అడ్డుకోవడంతో చాలా కాలంగా పనులు నిలిచిపోయాయి. రోడ్డు పక్కన డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉం డడంతో మురుగు నీరంతా రోడ్డుపైనే పారేది. రోడ్డుపై మురికి నీరు నిల్వ ఉండడంతో ప్రజలు దోమల బాధతో ఇబ్బందులు పడేవారు. రోడ్డంతా గుంతలు పడడం, వంతెన నుంచి కొద్ది దూరం వరకు రహదారి ఇరుకుగా మారడంతో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రహదారి విస్తరణ వల్ల జరిగే నష్టాన్ని ఇంటి యజమానులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడంతో అడ్డంకులు తొలగిపోయాయి. అసంపూర్తిగా ఉన్న పనులను అధికారులు ప్రారంభించారు.
రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. ముందుగా డ్రైనేజీ పనులను చేపట్టారు. డ్రైనేజీ పనులు, రహదారి విస్తరణ పనులు పూర్తయితే వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా కాగ్నా వాగుపై నిర్మించిన వంతెనపై పుట్పాత్లు లేకపోవడంతో కాలి నడకన వెళ్లే వారు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి కావడంతో వేగంగా వాహనాలు వస్తుంటాయని కాలినడకన వెళ్లేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనపై ఇరువైపులా పుట్పాత్లు నిర్మించాలని కోరుతున్నారు.
పనులు జరుగుతున్నాయి
రోడ్డు విస్తరణ కోసం ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో పనులు వేగంగా జరుగు తున్నాయి. ప్రస్తుతం డ్రైనేజీ పనులను చేపట్టాం. ఇవి పూర్తి కాగానే రోడ్డు పనులు ప్రారంభిస్తాం. గ్రామంలో కోస్గి రోడ్డు మలుపు నుంచి వంతెన వైపు కొన్ని ఇండ్లను తొలగించాల్సి ఉంది. వాటిని కూడా తొలగించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తాం.
– నాందేవ్రెడ్డి ఏఈ నేషనల్ హైవేస్ అథారిటీ