సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకొస్తూ ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సుల్లో రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం విజయవంతం కావడంతో గురువారం నుంచి టికెట్ జారీకి డిజిటల్ పేమెంట్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని మార్గాలలో నడుస్తున్న దాదాపు 40 ఎయిర్పోర్టు బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు పరుస్తున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ఆర్ఎం వెంకన్న ధ్రువీకరించారు.
డిజిటల్ పేమెంట్ విధానంతో టికెట్ జారీ చేయడానికి కస్టమర్, స్కానింగ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ సేవలు, స్వైపింగ్ వంటి అన్ని రకాల పద్ధతుల్లో వినియోగించవచ్చు. ఇందుకోసం తీసుకువచ్చిన ఐటిమ్స్ మిషన్లకు ఇంటర్నెట్ సదుపాయం, డేటా లేకపోయినప్పటికీ టికెట్ బుకింగ్కు ఈ యంత్రం పని చేస్తుందని తెలిపారు. అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత డిజిటల్ పేమెంట్ విధానంలో ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సుల్లో అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలోనే అన్ని సిటీ, జిల్లా బస్సుల్లో అమలు..
నగరంలో ఉన్న అన్ని రకాల సిటీ బస్సుల్లో కూడా వీలైనంత త్వరలోనే ఐటిమ్స్ మిషన్ల ద్వారా డిజిటల్, యూపీఐ ద్వారా టికెట్ జారీకి చెల్లింపు ప్రక్రియ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టారు. నగరంలోని ఆర్డినరీ సిటీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ల్లో కూడా ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. దాదాపు వచ్చే రెండు నెలల్లోనే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని విస్తరించడానికి ఉన్నతాధికారులు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ అధికారులు అభిప్రాయపడ్డారు.
అనంతరం దశల వారీగా జిల్లాతో పాటు ఇతర రాష్ర్టాలకు వెళ్లే బస్సులు, ఏసీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, రాజధాని, గరుడ, లగ్జరీ వంటి వాటిలో కూడా ఈ విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ విధానం పూర్తిగా అమల్లోకి రావడం వల్ల ప్రయాణికులు, టికెట్ జారీ క్రమంలో కండక్టర్లకు ఇప్పటికే తలెత్తే చిల్లర సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం బస్పాసుల జారీకి ఆయా కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులో ఉందని, దాని వల్ల ప్రయాణికులకు డబ్బుల చెల్లింపుల ప్రక్రియ సులభమైందని తెలిపారు.