ధారూరు, జూన్ 25 : తండాల్లో ప్రజలు వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని పులిచింతల మడుగుతండా, జీడిగడ్డ తండా, శేరిగడ్డతండాల్లో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ గ్రామం, తండాల్లో వేలిముద్రలు సరిగారాని పెద్దమనుషులకు పంచాయతీ కార్యదర్శులు వేలిముద్రలు పెట్టి పింఛన్లు ఇప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురుదోట్ల గ్రామంలో రేషన్ బియ్యం సరఫరా ఇబ్బందిగా ఉందని ఆయా తండావాసులు ఎమ్మెల్యేను కోరగా.. పులిచింతల మడుగుతండా, జీడిగడ్డతండా, శేరిగడ్డ తండాల ప్రజలకు పులిచింతల మడుగుతండాలోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పులిచింతల మడుగు తండాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు మంజూరు చేశామని, త్వరలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని వాడుకంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తండాల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామల్లో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని, లీకేజీ లేకుండా వాటర్ ట్యాంక్ను నెలకు మూడు సార్లు శుభ్రం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మాణం చేపట్టి వాడుకలోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ధారూరు వైస్ ఎంపీపీ విజయ్కుమార్, ధారూరు ఎంపీడీవో చంద్రశేఖర్, టీఆర్ఎస్ ధారూరు మండల అధ్యక్షుడు రాజునాయక్, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, మండల వ్యవసాయశాఖ అధికారి జ్యోతి, సర్పంచ్ సునితాశంకర్, వైస్ చైర్మన్ అంజయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజుగుప్తా, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ భువనేశ్వర్, మండల యువజన విభాగం అధ్యక్షుడు జైపాల్రెడ్డి, పార్టీ మండల నాయకులు రాములు, బాబయ్య, నాయకులు దేవేందర్, పుల్యనాయక్, బాలునాయక్, శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.