మంచాల, జూన్ 22 : తీరొక్క మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లెప్రకృతి వనాలు.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడమే గాక గ్రామాలకు కొత్తదనం తెచ్చాయి. ఒకప్పుడు ముళ్ల పొదలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయి. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు పార్కులను తలపిస్తున్నాయి. మంచాల మండలం ఆగపల్లి, మంచాల, ఆరుట్ల, రంగాపూర్, జాపాల, అస్మత్పూర్ తదితర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆగపల్లి సాగర్ రహదారి పక్కన ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు. అలాగే పల్లెప్రకృతి వనంలో కూర్చునేందుకు వీలుగా దాతల సహకారంతో ప్రత్యేకంగా బెంచీలను ఏర్పాటు చేశారు. సాయంత్రం వాకర్స్కు అనువుగా ఉండేలా వాకింగ్ ట్రాక్ సిద్ధం చేశారు. ఊరుకు దగ్గరగా ప్రకృతి వనం ఉండటంతో ప్రజలు ఇందులో సాయంత్రం గంటల తరబడి సేదాతీరుతారు. ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం నేడు మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. యువకులు, ఉద్యోగులు, మహిళలు వాకింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
పల్లెప్రకృతి వనంపై ప్రత్యేక శ్రద్ధ
పల్లెప్రకృతి వనంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించుకోవడంతోనే నేడు చిన్న పాటి అడవిని తలపిస్తున్నది. ప్రకృతి వనంలో పండ్లు, పూలు మొక్కలతో పాటు తదితర మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు ఉదయం, సాయంత్రం నీళ్లు పట్టేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాం. గతంలో రాళ్లతో నిండిపోయిన స్థలాన్ని చదును చేసి అందులో మొక్కలు నాటి సంరక్షించడంతో చూపరులను ఆకట్టుకుంటుంది.
– గోసుల జంగయ్య యాదవ్, సర్పంచ్, ఆగపల్లి