బడంగ్పేట, జూన్15 : పుట్టిన రోజులకు, శుభకార్యాలు వచ్చినప్పుడు జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి దాతలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సహకరించాలని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గ్రంథాలయాలను విజ్ఞాన గనిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.4.30 కోట్లతో నిర్మాణం చేసిన నూతన గ్రంథాలయ భవనాన్ని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కేంద్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు వాణి దేవి, బొగ్గారపు దయానంద్ గుప్తా, శ్రీధర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రమ్రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
జిల్లా గ్రంథాలయ నూతన భవనానికి మాజీ మంత్రి ఇంద్రారెడ్డి స్మారక భవనంగా నామకరణం చేశారు. గ్రంథాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. నూతన హంగులతో నిర్మించిన గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోటీ పరీక్షల పుస్తకాల కోసం రూ. 10 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. చిన్న పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
అనుకున్న సమయం కన్నా ముందుగానే గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి పూర్తి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పిలుపు మేరకు మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, దుర్గా దీప్లాల్, చౌహాన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రమ్రెడ్డి, కార్పొరేటర్ యాతం పవన్ గ్రంథాలయానికి ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు మంత్రి వారిని అభినందించారు. మహిళలు, చిన్న పిల్లలకు ఒకే చోట రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లతో పాటు కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
33 జిల్లాల్లో గ్రంథాలయాలు
శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ 33 జిల్లాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయిస్తున్నారని రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ శ్రీధర్ అన్నారు. నూతన హంగులతో గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మాణం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 గ్రంథాలయాలు ఉన్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో 40 గ్రంథాలయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.