కొత్తూరు రూరల్, జనవరి 20: కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం జహంగీర్పీర్ బాబా అని రాష్ట్ర వక్ఫ్బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ ఖాజీఫ్ ఫారూఖ్ ఆరిఫీ అన్నారు. మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామ శివారులోని సయ్యద్ హజరత్ జహంగీర్పీర్ దర్గాలో గురువారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారుల ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం గంధోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్బోర్డు అధికారులు, మైనార్టీ నాయకుల సమక్షంలో అసర్ నమాజ్ను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వక్ఫ్బోర్డు అసిస్టెంట్ సెక్రటరీలు ఖాజీఫ్ ఫారూఖ్ ఆరిఫీ, మన్సూర్ అహ్మద్, అమీర్ అహ్మద్ సందల్, పూలు, చాదర్ను నెత్తిన పెట్టుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి జహంగీర్ బాబాలకు అర్పించారు. మతపెద్దలు, ముజావర్ల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భక్తుల కోరిన కోర్కెలను జహంగీర్పీర్ బాబా నెరవేర్చుతారని, దర్గాలో కులమతాలకతీతంగా ఉర్సును జరుపుకోవటం విశేషమన్నారు.
అధిక సంఖ్యలో భక్తుల రాక
ఉర్సులో భాగంగా జహంగీర్పీర్ బాబాలకు సమర్పించేటువంటి సందల్(గంధం)ను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జేపీ దర్గా పవిత్ర పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందటంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. దీంతో యాత్రీకుల సౌకర్యా ర్థం వక్ఫ్బోర్డు అధికారులు, లైట్లు, మంచినీరు, మౌలిక వసతులను కల్పించారు. మరో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉర్సులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్, కొత్తూరు సీఐ భూపాల్శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలువురు ప్రముఖులు హాజరుకాలేదు. కార్యక్రమంలో మహ్మద్ గౌసొద్దిన్, ఇన్ముల్నర్వ, కొండన్నగూడ సర్పంచ్లు అజయ్మిట్టునాయక్, శ్రీనివాస్యాదవ్, ఉపసర్పంచ్ శ్రీరాములుయాదవ్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ రషీద్, తస్లీం, గోపాల్నాయక్, ఎండీ.జహంగీర్, సల్ల యాదగిరి, సయ్యద్ సిరాజ్ పాల్గొన్నారు.