ఇబ్రహీంపట్నం, జూన్ 12 : గర్భిణులు, పిల్లలను వ్యాధులబారి నుంచి కాపాడటానికి జిల్లా వైద్యారోగ్యశాఖ వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. జాతీయ ఆరోగ్య పాలసీలో భాగంగా ప్రతిఒక్కరికి వ్యాధి నిరోధక టీకాలు అందించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కొవిడ్ సమయంలో వివిధ కారణాల వలన పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషన్ ఇంద్రధనస్సు ద్వారా టీకాకు అర్హులైన గర్భిణులు, రెండేండ్ల లోపు పిల్లలందరిని గుర్తించటానికి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 12 రకాల వ్యాధులకు 12 రకాల వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచారు.
గర్భిణులు, శిశువులకు, 16 ఏండ్ల వారందరికీ ఈ టీకా అందజేస్తున్నారు. గర్భిణి, కాన్పు సమయంలో ఈ టీకా వేయడం వలన ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, ఈ టీకా వలన పిల్లలకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనవి అంగవైకల్యం, శిశు మరణాలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టీకాను ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలతోపాటు అనుభవం గల సిబ్బంది చేత వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాపై గ్రామాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు. వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవడం తల్లీ, పిల్లలకు ఎంత అవసరమో తెలియజేసే కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతుంది.
జిల్లా వ్యాప్తంగా 40 కోల్డ్చైన్ పాయింట్లు
వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి జిల్లాలో 40 కోల్డ్చైన్ పాయింట్లను జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పాయింట్లను జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రతి బుధ, శనివారం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అర్హులైన గర్భిణులు, పిల్లలందరికీ ఆశ కార్యకర్తల సహకారంతో ఈ టీకాలు ఇవ్వటం జరుగుతుంది. మండల స్థాయిలో సూపర్వైజర్లు, వైద్యాధికారులు.. జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయి అధికారులు పర్యవేక్షలో కొనసాగిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టీకాలు అందజేస్తున్నారు. ప్రతి బుధ, శనివారం ఇచ్చే టీకా కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. టీకా తీసుకోవడం వలన భవిష్యత్లో వచ్చే రోగాలను పూర్తిగా నయం చేసుకునే అవకాశముంటుంది.
జిల్లాలో టీకాల పంపిణీ
జిల్లాలో గర్భిణులు, చిన్నారులకు మిషన్ ఇంద్రధనస్సులో భాగంగా నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం వందశాతం పూర్తిచేసే విధంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా ఈ టీకాల పంపిణీ కార్యక్రమం పూర్తిచేస్తాం.
– స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి