రంగారెడ్డి, జూన్ 11, (నమస్తే తెలంగాణ) : జీవో 58 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సర్కార్ చర్యలను ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 19,692 దరఖాస్తులు అందగా.. పరిశీలన ప్రక్రియను జిల్లా రెవెన్యూ యంత్రాంగం వేగవంతం చేసింది. అన్ని విభాగాల అధికారులు 40 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నారు. మే 27 వ తేదీన ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటివరకు 10,254 దరఖాస్తుల పరిశీలన పూర్తిచేశారు. మరో 9,438 పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా వారం రోజుల్లో పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకుసాగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని 13 మండలాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. కాగా, దరఖాస్తుల పరిశీలనలో ప్రధానంగా నాలుగు అంశాలపై ఆరా తీస్తున్నారు. స్థలం 125 చదరపు గజాలలోపు ఉన్నదా, ఇల్లు 2-6-2014కు ముందు నిర్మించినదేనా.. దరఖాస్తుదారులు దారిద్య్రరేఖకు దిగువ స్థాయికి చెందినవారేనా.. స్థలం ప్రభుత్వ అభ్యంతరకర భూముల జాబితాలో ఉందా.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
జీవో 58 కింద వచ్చిన ప్రభుత్వ భూముల ఉచిత క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. గత నెల 27 నుంచి జిల్లాలో జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేపట్టింది. 40 బృందాల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతున్నది. జీవో 58 కింద జిల్లావ్యాప్తంగా 19,692 దరఖాస్తులురాగా, అత్యధికంగా శేరిలింగంపల్లి మండలంలో 6485 దరఖాస్తులు, బాలాపూర్లో 4124 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ దాదాపు 60 శాతం పూర్తయ్యింది. మరో వారం రోజుల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 19,692 దరఖాస్తులకుగాను ఇప్పటివరకు 10,254 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తికాగా, మరో 9438 దరఖాస్తుల పరిశీలించాల్సి ఉంది.
దరఖాస్తుల వెరిఫికేషన్లో భాగంగా జీవో 58 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించి 125 చదరపు గజాలలోపు ఉందా లేదనేది పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 125 గజాలకుపైగా ఉన్నట్లయితే జీవో 59 పరిధిలోకి వస్తుందని పరిశీలన బృందాలు రిమార్క్ రాస్తున్నారు. 02-06-2014కు ముందు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని ఉండి నివాసయోగ్యంగా ఇల్లు ఉందా లేదనేది కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న సదరు దరఖాస్తుదారుడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారా లేదనేది కూడా పరిగణనలోకి తీసుకొని వెరిఫికేషన్ చేస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చలాన్, విద్యుత్, నీటి బిల్లులను పరిశీలిస్తున్నారు. ఉచిత క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలం ప్రభుత్వ అభ్యంతరకర భూముల జాబితా(అసైన్డ్ భూములు, మిలిటరీ-కంటోన్మెంట్, రిజర్వ్ ఫారెస్ట్ భూములు, కోర్డు కేసు, ఖాళీ, మెట్రో రైల్కు కేటాయించిన స్థలం, కుంట, శిఖం భూములు, ఎఫ్టీఎల్, ఎనిమీ భూములు, పైగా భూములు, సర్కారీజంగాలట్, బోనవెకేటియా భూములు, భూదాన్, పట్టా, దేవాదాయ, వక్ఫ్, డిఫెన్స్, శ్మశానవాటిక భూములు)లో ఉందా లేదనేది పరిగణనలోకి తీసుకొని వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో ఏది సరిగ్గా లేకున్నా పరిశీలన బృందాలు క్షేత్రస్థాయిలోనే రిమార్క్ రాస్తున్నారు.
వారం రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి
– కలెక్టర్ అమయ్కుమార్
జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చలాన్, విద్యుత్, నీటి బిల్లులను పరిశీలిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 40 బృందాల ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా జీవో 58 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతున్నది.