పరిగి, జూన్ 9 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ మన ఊరు-మన బడి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలకు సంబంధించి 76శాతం పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టే కిచెన్షెడ్, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణపు పనులకు గ్రౌండింగ్ చేసి పరిపాలపాపరమైన అనుమతులు పొంది పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. రూ.30లక్షల లోపు గ్రౌండింగ్ అయిన పాఠశాలలకు విద్యుద్దీకరణ పనులు చేపట్టి రెండు రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా సూచించారు.
అదనపు తరగతి గదుల నిర్మాణం పనుల పూర్తి వివరాలను అందించి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి పరిపాలనా అనుమతులు పొందాలని, వెనువెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కానున్నందున పాఠశాలల పనులను త్వరగా పూర్తి చేసి సిద్ధం చేయాల్సిందిగా చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి, వివిధ ఇంజినీరింగ్ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలున్నారు.