షాద్నగర్, జూన్ 5 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అభివృద్ధి పనులను చేపడుతున్నది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణాలు, సర్కారు దవాఖాన పనులు ప్రారంభం కాగా, ఆర్వోబీ పనులూ ప్రారంభం కానున్నాయి. మాడల్ మార్కెట్, గ్రంథాలయ భవనం, ఆడిటోరియం వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ వాసుల అవసరాల దృష్ట్యా ప్రధానదారుల్లో కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
శరవేగంగా పాత జాతీయ రహదారి విస్తరణ..
షాద్నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన పాత జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొత్తూరు మండల కేంద్రం నుంచి షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ బైపాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టి ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. రూ. 67.75కోట్ల నిధులతో నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో దాదాపుగా రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వంతెనల నిర్మాణాలు మినహా సాధారణ రోడ్డు విస్తరణ పనులు ప్రజలు ఉహించని విధంగా కొనసాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. పాత జాతీయ రహదారి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా రోడ్డు పరిసర ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి.
రూ.20.89కోట్లతో 100 పడకల దవాఖాన..
కొన్నేండ్లుగా ప్రకటనలకే పరిమితమైన 100 పడకల దవాఖాన నిర్మాణానికి మోక్షం లభించింది. ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక సహకారంతో రూ. 20.89 కోట్ల నిధులను వెచ్చించి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంద పడకల నిర్మాణాన్ని చేపట్టారు. ఫరూఖ్నగర్ మండలం అలిసాబ్గూడ రెవెన్యూ పరిధిలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 100 పడల దవాఖానను నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి టి.హరీశ్రావు నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా ట్రామ కేర్ సెంటర్, డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తేనున్నారు. కేశంపేట మండల కేంద్రంలో రూ.80 లక్షలు వెచ్చించి 30 పడకల సర్కారు దవాఖానను నిర్మిస్తున్నారు.
గ్రంథాలయం, ఆడిటోరియం..
షాద్నగర్ మున్సిపాలిటీలో నూతనంగా గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ. 1.88 కోట్ల నిధులతో భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. విశాలమైన గదులతో పాటు, లైబ్రరీ గదులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను నిర్మిస్తున్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు, వారి ప్రతిభను గుర్తించేలా ప్రభుత్వం నూతన ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మండల పరిషత్ ఆవరణలో రూ.5 కోట్ల నిధులను వెచ్చించి ఆధునిక సాంకేతిక విధానంతో ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. పార్కింగ్, థియేటర్, కళాకారుల ప్రదర్శన వేదిక, కళాకారులు సేద తీరేందుకు వసతులు, సౌండ్, లైటింగ్ సిస్టమ్ వంటి వసతులతో ఆడిటోరియం అందుబాటులోకి రానున్నది. త్వరలోనే పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రారంభానికి సిద్ధమైన మున్సిపల్ భవనం
మున్సిపల్ వాసుల అవసరాలకు అనుగుణంగా షాద్నగర్ పట్టణంలో రూ.5 కోట్ల నిధులతో నూతనంగా మున్సిపల్ భవనాన్ని నిర్మించారు. పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉందని అధికారులు చెప్పారు. మున్సిపల్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులకు అనువుగా విధులను నిర్వహించేందుకు విశాలమైన గదులను నిర్మించారు. సామాన్య ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా అధికారులకు అందజేసేలా వసతులను సమకూర్చారు. మరో 30 ఏండ్లను దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణాన్ని చేపట్టారు.
రూ.4.5 కోట్లతో మాడల్ మార్కెట్..
మున్సిపల్ ప్రజల అవసరాల దృష్ట్యా షాద్నగర్ మున్సిపాలిటీలోని పాత కూరగాయల మార్కెట్ ఆవరణలో రూ.4.5 కోట్ల నిధులను వెచ్చించి మాడల్ మార్కెట్ను నిర్మిస్తున్నారు. జిల్లాలోనే ఆదర్శవంతంగా నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. ఒకే ఆవరణలో కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చేపలను విక్రయించేందుకు 108 దుకాణాలను నిర్మిస్తున్నారు. ప్రజలకు అనువుగా పార్కింగ్ సౌకర్యం, తాగునీటి వసతి, మరుగుదొడ్ల సదుపాయం, రవాణా వసతులను కల్పించనున్నారు. మాడల్ మార్కెట్ నిర్మాణంతో రైతులు నేరుగా తమ పంటను మార్కెట్ ఆవరణలో ప్రజలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది.
రూ.4.5కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం..
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రాఫిక్ అధికంగా ఉండే కాలనీలో రూ. 4.5 కోట్ల నిధులను వెచ్చించి సీసీ రోడ్లను నిర్మించారు. విజయ్నగర్ కాలనీ, నాగులపల్లి రోడ్డు, ఫరూఖ్నగర్ ఎస్సీ కాలనీ రోడ్డు, కోర్టు భవనం రోడ్డు, విద్యుత్ కాలనీ ప్రధాన రోడ్లను ఆధునీకరించారు. వెడల్పుగా రోడ్ల నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సీసీ రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యతో పాటు నివాసాలకు వచ్చే దుమ్ము బెడద తగ్గిందని స్థానికులు చెబుతున్నారు.
త్వరలోనే చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభం..
షాద్నగర్ మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా ప్రజలు తీవ్రంగా ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్న చటాన్పల్లి రైల్వే గేట్ సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం లభించనున్నది. రూ.95 కోట్ల నిధులను వెచ్చించి రైల్వే గేట్పై వంతెనను నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నిర్మాణాల పనుల కోసం ఇప్పటికే సర్వే పూర్తి చేసి టెండర్లను ఆహ్వానించారు. అతి త్వరలోనే పనులు ప్రారంభవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉపరితల వంతెనతో పాటు అండర్ పాస్ రోడ్డు సౌకర్యం కూడా అందుబాటులోకి రానున్నది. షాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
నియోజకవర్గ అభివృద్ధికి చేస్తా. పాత జాతీయ రహదారి, చటాన్పల్లి బ్రిడ్జి, ఆడిటోరియం, మాడల్ మార్కెట్, సర్కారు దవాఖాన వంటి పనులు ప్రారంభం కావడం సంతోషకరం. సీఎం కేసీఆర్ సహకారంతో మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
– వై. అంజయ్యయాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే
గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి..
షాద్నగర్ నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి సమస్య తీరింది. పట్టణ వాసులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. రూ.కోట్లను వెచ్చించి అన్ని కాలనీల్లో పనులు చేస్తున్నాం.
– కె.నరేందర్, మున్సిపల్ చైర్మన్, షాద్నగర్ మున్సిపాలిటీ