పరిగి, జూన్ 4: విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులను వికారాబాద్ కలెక్టర్ నిఖిల సస్పెండ్ చేయడంతోపాటు ఒక ఎంపీవోను బదిలీ చేశారు. శనివారం సాయంత్రం మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీలో పల్లె ప్రగతిపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం చేసినందుకు పూడూరు మండలం గొం గుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రుతి, చింతల్పల్లి పంచాయతీ కార్యదర్శి హమీద్, పరిగి మండలం మాదారం పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, వికారాబాద్ మండలం మదన్పల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే సరైన పర్యవేక్షణ చేయని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పూడూరు ఎంపీవో కరీంను కులకచర్ల ఎంపీవోగా బదిలీ చేస్తున్నట్లు.. కులకచర్ల ఎంపీవో సురేందర్ను పూడూరు ఎంపీవోగా నియమిస్తున్నట్లు తెలిపారు.
పల్లెప్రగతి కార్యక్రమ పనుల్లో నిర్లక్ష్యం.. మురికి కాలువలను శుభ్రం చేయించకపోవడం, రోడ్లు అపరిశుభ్రంగా ఉండటం వంటి పలు పను ల్లో నిర్లక్ష్యం చేసినందుకు వారిపై వేటు వేసినట్లు కలెక్టర్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్థాయి లో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు.. ఈ బృందాలు ప్రతి వారం గ్రామాలను సందర్శించి పనులను పరిశీలించి నివేదికలను అందిస్తాయన్నారు. గ్రామాల ప్రారంభం నుంచి చివరి వరకు రోడ్డుకు ఇరువైపులా రెండు, మూడు వరుసల్లో గుంతలను తవ్వించి మొక్కలను పంచాయ తీ కార్యదర్శులు నాటించాలన్నారు. పల్లెప్రకృతి వనాల్లోని మొక్కలను సంరక్షించాలని, వైకుంఠధామాల్లో విద్యుత్, నీటి వసతి కల్పించడంతోపాటు వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ భవనాల లోపల, చుట్టూ పరిశుభ్రం చేయించాలని ఆదేశించారు. రోడ్లపై మురికినీరు నిలువకుండా చూడటంతోపాటు ఇంకుడుగుంతలను ఏర్పాటు చేయించాలని సూచించారు. గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఈనెల 18వ తేదీ లోపు స్థలాలను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.