యాలాల జూన్ 4 : అంతర, మిశ్రమ విధానంలో కూరగాయల సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఓ యువ రైతు. యాలాల మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన జోగు శ్రీనివాస్ నూతన ఒరవడితో ముందుకెళ్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పంటలను నష్టపరిచే కత్తెర, గులాబీ పురుగులు లాంటి కీటకాల సమస్యను అరిక్టడానికి, ప్రకృతి వ్యవసాయం. దేశీ విత్తనాలు, అంతర, మిశ్రమ పంటల విధానాలు సాగులో ఉపయోగిస్తున్నాడు. ఆ విధంగానే మిశ్రమ పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ ప్రకృతి వ్యవసాయంలో లాభాలు ఆర్జిస్తున్నాడు.
అందులో భాగంగా అంతర పంటల విధానంలో వంకాయ, టమాట, పాలకూర, ఉల్లి, మిర్చి పంటలను పండిస్తున్నాడు యువరైతు శ్రీనివాస్. కూరగాయలను సాగు చేస్తూ లాభాలనార్జిస్తున్నారు. అంతర, మిశ్రమ పంటల విధానాలు సాగులో రైతులకు లాభాలు అధికంగా వస్తున్నాయి. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిలిపి వేయడం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఉన్న కొద్దిపాటి నీరు బిందు(డ్రిప్)/తుంపర(స్ప్రిక్లర్) పద్ధతిలో ఇవ్వటం వలన కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయ పంటలు పండించవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటల్లో ఎండ తీవ్రత తగ్గించడానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళలో నీటిని పిచికారి చేయడం మంచి పద్ధతి. రైతులు అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే రకాలను రైతులు ఎన్నుకోవడం ఉత్తమం.