ధారూరు, మే 31 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు మండలంలో జోరుగా కొనసాగుతున్నాయి. రైతులు కష్టపడి పండించుకున్న పంటలకు భరోసాను కల్పించేందుకు ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తూ రైతన్నలకు అన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నారు. రైతు కష్టానికి తగ్గట్టుగా మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తున్నదని, దళారీ వ్యవస్థను రూపుమాపే విధంగా ప్రభుత్వం నేరుగా రైతుల ద్వారా పంట కొనుగోళ్లు చేపడుతున్నది. ధారూరు మండల పరిధిలోని మూడు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ధారూరు మండల కేంద్రంలోనూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, నాగారం గ్రామంలో పీఏసీఎస్ ధారూరు ఆధ్వర్యంలో, గట్టేపల్లి గ్రామంలో పీఏసీఎస్ హరిదాస్పల్లి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేనప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి ధాన్యాన్ని దళారులకు అమ్మేవారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఏర్పాటు చేయడంతో రైతులు వారి సమీప ప్రాంతాల్లో పంటను అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ గ్రేడు ధాన్యానికి రూ.1960, కామన్ గ్రేడు ధాన్యానికి రూ.1940 ప్రకారం పీఏసీఎస్ , వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. రైతులు తీసుకువచ్చే ధాన్యం నాణ్యతను, తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర ప్రకటిస్తామని అధికారులు తెలియ జేస్తున్నారు.
దళారుల బాధ తప్పింది..
రైతులు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దళారుల వద్ద వారు ఇచ్చిన ధరలకు తెచ్చిన ధాన్యాన్ని అమ్మి తీవ్రంగా మోసపోయే వాళ్లం. ఒకప్పుడు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందక అన్నదాతలు నష్టపోయి అనేక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రైతులు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించి, గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనేలా ఏర్పాట్లు చేశారు. రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదములు.
– సొప్పరి వెంకటయ్య, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు, ధారూరు