ఇబ్రహీంపట్నంరూరల్, మే 28 : గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్చేది…ముక్కు పుటలదిరేలా కంపు వాసన కొడుతున్న మురుగు కాలువలు దర్శనమిచ్చేవి. పరిసరాలన్నీ అపరిశుభ్ర వాతావరణంలో ఉండేవి. ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోయి గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో దోమలు ప్రబలి వ్యాధులబారిన పడేవారు. దవాఖానలకు పోయినా సరిగ్గా పట్టించుకునేవారు కాదు. కాని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పల్లె అభివృద్ధితో పాటు పరిశుభ్రతతో బాగుండాలన్న సంకల్పంతో ప్రతి గ్రామానికి సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించి, ప్రత్యేక ట్రాక్టర్ను కేటాయించి ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు గ్రామంలో వీధివీధిన తిరుగుతూ..చెత్తసేకరణ చేసి కంపోస్టుయార్డుకు తరలించి కంపోస్టు ఎరువు తయారు చేయిస్తున్నారు.
ఈ ఎరువు పంటలకు ఎంతో లాభం చేకూరుస్తున్నందున గ్రామపంచాయతీల ద్వారా కంపోస్టు ఎరువును విక్రయించి గ్రామపంచాయతీలకు ప్రత్యేక ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ప్రతిరోజు గ్రామంలో ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్ వీధుల్లో తిరుగుతూ..ఇండ్లలోని చెత్తాచెదారాన్ని కంపోస్టు యార్డుకు తరలించి యార్డులో చెత్తను వేరుచేసి ఎరువుకు ఉపయోగపడే పదార్థాలతో కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాల్లోని చెట్లతో పాటు గ్రామాల్లో రోడ్లకిరువైపులా నాటిన వివిధ రకాల మొక్కలకు అందజేస్తున్నారు.
మిగిలిన ఎరువును ఆసక్తి ఉన్న రైతులకు విక్రయించి గ్రామపంచాయతీకి ఆదాయం చేకూరుస్తున్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని 84గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ సహకారంతో పూర్తయిన కంపోస్టు యార్డుల్లో ఎరువును ముమ్మరంగా తయారు చేస్తూ మొక్కలకు సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. అలాగే, పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం పెంచుతున్న వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల తోటలకు ఈ ఎరువును ఉపయోగిస్తున్నారు.
కంపోస్టు ఎరువు తయారీ విధానం
కుల్లిన, పాడైన కూరగాయలు, బీడీ, ఆకు, తుక్కులాంటివి కంపోస్టు తయారుచేసే అరలో వేస్తారు. అంతకు ముందు కింద కొబ్బరిపీచు వేసి పశువుల పేడ 20 కిలోలు వేస్తారు. చెత్తను పొరలు, పొరలుగా వేస్తూ నీళ్లు చల్లుతారు. అరను నింపిన తర్వాత అందులో వానపాములను వేస్తారు. ఆ తర్వాత పైనుంచి గన్నీ సంచులతో మూసివేస్తారు. ప్రతిరోజు పైనుంచి నీల్లు చల్లుతుంటారు. ఇలా 45 రోజుల నుంచి రెండు నెలల వరకు సేంద్రియ ఎరువు తయారవుతుంది.
మంచి ఫలితాలు వస్తున్నాయి
ఉత్పత్తి చేసిన ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు, చెట్లకు వేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇతర అట్టలు, కాగితాలు, చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం కొంత ఆదాయం సమకూరుతున్నది. భవిష్యత్తులో సేంద్రియ ఎరువుపై ఆసక్తి ఉన్న రైతులకు విక్రయించేందుకు కృషి చేస్తాం. పరిసరాల పరిశుభ్రతతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– రాంరెడ్డి, ఉప్పరిగూడ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు,
మొక్కలకు మంచి ఎరువుగా..
ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన కంపోస్టుయార్డుల ద్వారా తయారు చేసిన ఎరువు మంచి ఫలితాలనిస్తున్నది. ఆ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు వేయడం ద్వారా చెట్లు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రోడ్లకిరువైపులా, ఖాళీస్థలాలు, ప్రభుత్వ స్థలాలు, పల్లె ప్రకృతివనం, శ్మశాన వాటికల్లో నాటిన మొక్కలకు ఈ ఎరువును వేస్తున్నాం.
– శివరాల జ్యోతి, ముకునూరు సర్పంచ్