కొడంగల్, మే 28 : ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చరిత్రలో నిలిచే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పాఠశాలల బలోపేతానికి నాంది పలికారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రైవేటుకు దీటుగా ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పాఠశాలలపై శ్రద్ధ తీసుకోకపోవడంతో నేడు పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నది. దీంతో మన పాఠశాలలను మనం తీర్చిద్దుకోవాలనే సంకల్పంతో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మన ఊరు-మన బడితో కోట్లాది నిధులను మంజూరు చేస్తున్నది.
పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 65 సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతూ వస్తున్నది. అప్పట్లో ఈ ఒక్క పాఠశాలనే అందుబాటులో ఉండటంతో కర్ణాటక ప్రాంతవాసులు కూడా ఇక్కడ విద్యను అభ్యసించేవారు. ఆనాటి నుంచి కూడా ఈ పాఠశాల చదువుల్లో ప్రత్యేకత సంతరించుకొని అన్నింటా ముందుంది. విద్యతోపాటు క్రీడల్లో కూడా అప్పట్లో రాణించిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచారు. కాగా ప్రస్తుతం పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని, సరిపడా తరగతి గదులు అందుబాటులో లేక విద్యార్థులు చెట్ల కింద చదువులు కొనసాగిస్తున్నారు. వర్షం వచ్చిందంటే తరగతి గదులు వర్షపు నీటితో తడిసి సెలవు ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో వారు చదువుకున్న పాఠశాల మరింతగా అభివృద్ధి చెందేలా సహకరిస్తున్నారు.
చదువుకున్న పాఠశాల అభివృద్ధి చెందేలా సహకారం
రాంరెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టి పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకున్న రెండు తరగతి గదులను తొలగింపజేసి విశాల మైదానాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలకు చాలా వరకు ఖాళీ స్థలం ఉండటంతో మొక్కలు నాటి పాఠశాలకు పచ్చటి స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పాలని సంకల్పించిన ఉపాధ్యాయులు హరితహారం కింద మూడు సంవత్సరాల క్రితం దాదాపు 2వేల మొక్కలను నాటారు. నాటిన మొక్కలను సంరక్షించేలా చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సొంత ఖర్చులతో ట్యాంకర్ ద్వారా నీటిని అందించి కాపాడుకుంటూ వచ్చారు.
ఆనాటి మొక్కలు ప్రస్తుతం పెరిగి పెద్దవై పచ్చటి వాతావరణంతో నీడ, చల్లటి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో నాటిన 2వేల మొక్కల్లో 1500 వరకు మాత్రమే మొక్కలను రక్షించుకోగలిగామని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో నీటి సౌకర్యాలు అందుబాటులో లేకుంటే దాతల సహకారంతో బోరు, మోటర్ ఏర్పాటు చేశారు. తరగతి గదుల కొరతతో అప్పట్లో భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలోనే తరగతులు, పాఠశాల కార్యాలయం కొనసాగుతున్నాయి.
కాగా ఇప్పటికీ 10 తరగతి గదుల కొరత, ప్రహరీ, తాగునీటి సౌకర్యాలు తదితర సమస్యలు నెలకొని ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించడం చాలా సంతోషంగా ఉందని, ప్రైవేటుకు దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. మన ఊరు మన బడితో పాఠశాలకు రూ.3.కోట్ల58లక్షల నిధులు మంజూరయ్యాయని, పనులు ప్రారంభం కావాల్సి ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
మన ఊరు-మన బడికి రూ.3కోట్ల58లక్షలు మంజూరు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని నిర్వహించి కోట్లాది నిధులతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ పాఠశాలకు రూ.3కోట్ల58లక్షలు మంజూరయ్యాయి. పాఠశాలలో అదనపు తరగతి గదులు, ప్రహరీ, భోజనశాల నిర్మాణంతోపాటు తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అంచనా రూపొందించారు. నిధుల మంజూరుతో కలెక్టర్ నిఖిల పాఠశాలను సందర్శించి పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై పరిశీలించారు.
తరగతి గదుల నిర్మాణంతోపాటు విద్యార్థులకు అన్నింటా సౌకర్యాలతో కూడిన భోజనశాల, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణాలపై స్థలాన్ని పరిశీలించారు. జీ ప్లస్ వన్ పద్ధతిన కింద 5 తరగతి గదులు, పైన 5 తరగతి గదులను నిర్మించాలని, ప్రస్తుతం నిర్మితమైన పాఠశాల భవనంపై భోజనశాల ఏర్పాటుకు సూచించారు. అన్ని హంగులతో ఉండేలా ఆకర్షణీయంగా ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు వంటి వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కిచెన్ షెడ్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలోనే అత్యధికంగా ఈ పాఠశాల నిధుల మంజూరుకు ఎస్టిమేషన్ వచ్చిందని, దీంతో ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనకు అన్నింటా పూర్తి చర్యలు తీసుకోవాలని.. అవసరం మేరకు నిధుల వినియోగంపై ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో పనుల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణ చాలా విశాలంగా ఉందని, అందుకు తగ్గట్టుగా ప్రత్యేక శ్రద్ధతో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంపై ఉపాధ్యాయులను అభినందించారు.
మన ఊరు-మన బడితో పాఠశాల అభివృద్ధి
– గోపినాథ్, ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్, కొడంగల్
మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలు అభివృద్ధి చెందే ఆస్కారం ఏర్పడింది. చాలాకాలంగా పాఠశాల మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. పాఠశాలలో ఆధునిక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. డైనింగ్ హాల్ అందుబాటులో లేక విద్యార్థులు తరగతి గదుల్లో, చెట్ల నీడన కూర్చొని భోజనం చేస్తున్నారు. డైనింగ్ హాల్ అందుబాటులోకి వస్తే విద్యార్థులంతా ఒకే చోట కూర్చొని భోజనం చేసే సదుపాయం ఏర్పడుతుంది. దీంతో తరగతి గదులు శుభ్రంగా ఉంటాయి.