బొంరాస్పేట, మే 26 : మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు నష్టపోరాదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నది. యాసంగిలో ప్రభుత్వం చేసిన సూచనల మేరకు రైతులు వరి పంట సాగును గణనీయంగా తగ్గించారు. అయినా ఇతర పంటల సాగుకు అనుకూలంగా లేని బోర్లు, చెరువుల కింద వరి పంటను రైతులు సాగు చేశారు.
ధాన్యం కొనుగోలుపై రైతుల హర్షం
రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మండలంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నది. కేంద్రాలు 6 ఐకేపీ ఆధ్వర్యంలో, 5 పీఏసీఎస్, 2 వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే ఏ గ్రేడు ధాన్యానికి రూ.1960, బీ గ్రేడు ధాన్యానికి రూ.1960 చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకే తెస్తున్నారు. రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో పరిశీలించి తూకం వేసి దాని ప్రకారమే ధరను చెల్లిస్తున్నారు. ధాన్యంలో తాలు, మట్టిని తొలగించడానికి కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం యంత్రాలను సరఫరా చేసింది. వాటిద్వారా తాలు, మట్టిని తొలగిస్తున్నారు. తూకం వేసిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్లో అప్లోడ్ చేస్తున్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమవుతున్నది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మేలు చేసిందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
26018 క్వింటాళ్ల ధాన్యం సేకరణ
మండలంలోని 13 కేంద్రాల్లో బుధవారం నాటికి 688 మంది రైతుల నుంచి 26018 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నాగిరెడ్డిపల్లిలో(ఐకేపీ) 1316 క్వింటాళ్లు, చిల్ముల్మైలారంలో(పీఏసీఎస్) 1515, చౌదర్పల్లిలో(పీఏసీఎస్) 1600, గౌరారంలో(పీఏసీఎస్) 5273, మెట్లకుంటలో(ఐకేపీ) 3940, బొంరాస్పేటలో(ఐకేపీ) 2531, దుద్యాలలో(పీఏసీఎస్) 3200, నాందార్పూర్లో(ఐకేపీ) 1056, బురాన్పూర్లో(ఏఎంసీ) 1186, లగచెర్లలో(పీఏసీఎస్) 1611, ఏర్పుమళ్ల(ఐకేపీ)లో 1776, ఎనికేపల్లి(ఏఎంసీ)లో 705, కొత్తూరులో(ఐకేపీ) 1907 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాలకు ఇంకా ధాన్యం వస్తూనే ఉంది. అన్ని కేంద్రాలు రైతులు తెచ్చిన ధాన్యం రాసులతో నిండిపోయాయి. మార్కెట్కు, మధ్య దళారులకు అమ్మే అవకాశం లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి లాభం పొందుతున్నారు. సకాలంలో డబ్బులు కూడా ఖాల్లో జమవుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తూకం చేసిన ధాన్యాన్ని స్థానిక రైస్ మిల్లులకు వెంటనే తరలిస్తున్నారు.