కడ్తాల్, మే 26 : క్రీడలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో గురువారం మండల పరిధిలోని పోశమ్మగడ్డ తండాలో స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా స్థలాలను ఎంపిక చేసి పనులను ప్రారంభించాలని అధికారులను కోరారు. ఎంపిక చేసిన స్థలాలను చదును చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ సుందర్, సర్వేయర్ ఆంజనేయులు, నాయకులు లక్పతినాయక్, టీకులాల్నాయక్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
వేగంగా స్థల సేకరణ
యాచారం : క్రీడా మైదానాలకు స్థల సేకరణ పక్రియను అన్ని గ్రామాల్లో మరింత వేగవంతం చేయాలని ఎంపీడీవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని మాల్కు అనుబంధంగా ఉన్న కిషన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాన్ని పంచాయతీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, 13 అనుబంధ గ్రామాల్లో తప్పనిసరిగా క్రీడా మైదానాలకు స్థలాలను సేకరించాలన్నారు. మొత్తం 37క్రీడా స్థలాలను సేకరించేందుకు కార్యదర్శులకు రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, యవజన సంఘాలు అన్ని విధాలా సహకరించాలని సూచించారు. జూన్ 2న ప్రారంభించేందుకు మండలంలో ఒక క్రీడా మైదానాన్ని అన్ని హంగులతో సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ స్థలం లేని గ్రామాల్లో లేఅవుట్లలో గ్రామ పంచాయతీలకు కేటాయించిన 10శాతం స్థలంలో క్రీడా మైదానాలకు వెంటనే స్థలాలను సేకరించాలన్నారు.
క్రీడా స్థలాల పరిశీలన
మంచాల : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాస్థలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తహసీల్దార్ దేవూజా అన్నారు. గురువారం 26 రెవెన్యూ గ్రామ పంచాయతీల్లో స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటికే 20 గ్రామాల్లో స్థలాలను గుర్తించామని, మిగతా గ్రామాల్లో కూడా స్థలాలను గుర్తించి కలెక్టర్కు నివేదిక పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ, ఈవోపీఆర్డీ తుల్జాసింగ్ పాల్గొన్నారు.