పరిగి, మే 25 : వికారాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర సర్కార్ మరో వరాన్ని అందించనున్నది. ఇప్పటికే టీ డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తున్నది. దీంతో పాటు అధికంగా డబ్బులు ఖర్చయ్యే ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్రే, డాప్లర్ స్టడీ వంటి పరీక్షలను సైతం ఉచితంగా అందించేందుకు వికారాబాద్ ఏరియా దవాఖాన సమీపంలో రేడియాలజీ ల్యాబ్ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు రాష్ట్ర సర్కార్ రూ.75లక్షలను మంజూరు చేసింది. మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతో పాటు వేలాది రూపాయల విలువ చేసే పరీక్షలు ఉచితంగా చేయనుండడంతో పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరనున్నది.
ప్రజలకు ఉచిత వైద్యంపై ప్రభుత్వం మరింత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. ఇప్పటికే సర్కారు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలను అందించడంతో దవాఖానలకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతోపాటు అన్ని సర్కారు దవాఖానల్లో మరిన్ని సదుపాయాలను కల్పించడం కోసం కృషి జరుగుతున్నది. కరోనా సంక్షోభం తర్వాత ప్రభుత్వం సర్కారు వైద్యంపై మరింత శ్రద్ధ వహిస్తున్నది. ప్రస్తుతం ప్రైవేట్ వైద్యశాలలకు ఏ చిన్న రోగమని వెళ్లినా అనేక రకాల వైద్య పరీక్షలు చేయించాల్సి వస్తున్నది. వైద్యం కంటే ముందు వైద్య పరీక్షలకు వేలాది రూపాయలు ఖర్చవుతున్న నేపథ్యంలో పేదవారికి ఉపయోగకరంగా ఉండేందుకు ప్రభుత్వం వికారాబాద్లో ఇప్పటికే టీ డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నది. దీనికితోడు వికారాబాద్లో రూ.75లక్షలు వెచ్చించి రేడియాలజీ ల్యాబ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ల్యాబ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా గుర్తించారు.
రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి ఏర్పాట్లు
ప్రతి జిల్లాలో ఒక రేడియాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్ శివారులో గల ఏరియా దవాఖాన సమీపంలో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణాన్ని చేపట్టడానికి రూ.75లక్షలు మంజూరయ్యాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. సుమారు 3వేల చదరపు గజాల స్థలంలో ఈ ల్యాబ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. సుమారు 6 నెలల వ్యవధిలోనే ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. రేడియాలజీ ల్యాబ్ నిర్మాణంతో ఇక్కడ ఒక రేడియాలజిస్ట్తోపాటు మరింత మంది సిబ్బంది నియామకం జరుగుతుంది. ఈ ల్యాబ్ నిర్మాణంతో పేదవారికి ఉచితంగా మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్రే, డాప్లర్ స్టడీ తదితర వైద్య సేవలు అందుతాయి. ఏ చిన్న వ్యాధి సోకినా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు రూ.10వేల విలువ చేసే ఎంఆర్ఐ వంటి వైద్య పరీక్షలు ఉచితంగానే అందనున్నాయి.
ఉచిత వైద్య పరీక్షలపై సర్కారు దృష్టి.
పేదలకు ఓవైపు ఉచితంగా వైద్య సేవలు అందించడంతోపాటు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కారు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే వికారాబాద్లో గత సంవత్సరం జూన్లో డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటుచేసి 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ 400 నుంచి 500 వరకు శాంపిల్స్ ఈ కేంద్రానికి అందుతున్నాయి. వెనువెంటనే పరీక్షలు నిర్వహించి 24 గంటల్లో వాటి ఫలితాల సమాచారాన్ని ఫోన్లకు అందిస్తున్నారు. ఇదిలావుండగా ఈ పరీక్షా ఫలితాలను ప్రింట్ రూపంలో అందించేందుకు త్వరలోనే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రింటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రజలకు మరిన్ని వైద్య పరీక్షలు ప్రదీప్కుమార్, డీహెచ్క్యూఎస్, వికారాబాద్
వికారాబాద్లో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణంతో మరిన్ని వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా జిల్లా ప్రజలకు 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నాం. శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లో పరీక్షలు జరిపి ఫలితాలు తెలియజేస్తున్నాం. రేడియాలజీ ల్యాబ్ నిర్మాణం పూర్తయితే ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. వేలాది రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలన్నీ ప్రజలకు ఉచితంగా అందించే అవకాశం కలుగుతుంది.