కొత్తూరు, మే 25 : తలతల మెరిసే సీసీ రోడ్లు, మిలమిల మెరిసే వీధి దీపాలు, ఎటు చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పచ్చదనం, పబ్లిక్ టాయిలెట్స్, నూతనంగా నిర్మిస్తున్న మున్సిపాలిటీ భవనం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, చెత్త సేకరణ కోసం 4 స్వచ్ఛ ఆటోలు.. ఇలా గతానికి భిన్నంగా కొత్తూరు కొత్త కొత్తగా కనిపిస్తున్నది. ఏడాదిగా జరుగుతున్న అభివృద్ధితో కొత్తూరు మున్సిపాలిటీ రూపురేఖలే మారిపోయాయి. మున్సిపాలిటీగా మారిన సంవత్సరానికే ఇంత అభివృద్ధి జరిగిందా? అని మున్సిపాలిటీ ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వచ్చే అరకొర నిధులతో అభివృద్ధికి ఆమడ దూరాన నిలిచిన కొత్తూరు.. నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. గతంలో తాగడానికి కూడా మంచినీళ్లు లేని పరిస్థితి నుంచి నేడు సకల హంగులతో వెలిగిపోతున్నది. ఏడాది క్రితం ఏర్పడిన మున్సిపాలిటీ పాలకవర్గం కొత్తూరును అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నారు.
రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు
– టీయూఎఫ్ఐడీసీ ద్వారా మంజూరైన రూ. 3.5 కోట్లతో మున్సిపాలిటీ నూతనం భవన నిర్మాణం జరుగుతున్నది
– రెండు పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి అనేక మొక్కలు పెంచుతన్నారు. అంతే కాకుండా మరో 4 పట్టణ ప్రకృతి వనాలకోసం ప్రతిపాదనలు పంపారు.
– నర్సరీ ఏర్పాటు చేసి 40 వేల మొక్కల పెంచుతున్నారు.
– చెత్త సేకరణ కోసం రూ. 25 లక్షతో 4 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేశారు.
– హరితహారంలో భాగంగా మున్సిపాలిటీలోని కొత్తూరు, తిమ్మాపూర్, కుమ్మరిగూడ, ఫాతిమాపూర్లో 34 వేల మొక్కలు నాటారు.
– వైకుంఠధామాన్ని అభివృద్ధి చేయడానికి రూ. కోటి, వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరయ్యాయి.
– రూ. 15 లక్షలతో అంతర్గత మ్యాన్హోళ్లను మరమ్మతులు చేశారు. రూ. 40 లక్షలతో అంతర్గత డ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
– వివిధ వార్డుల్లో 360 వీధి దీపాలు, రూ. 6.5 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
– సీఎస్ఆర్ ఫండ్స్తో తిమ్మాపూర్లో సెంట్రల్ లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
– కొత్తూరు వై జంక్షన్ సుందరీకరణ కోసం రూ. 1.5 కోట్లు మంజూరయ్యాయి.
– రూ.1.76 కోట్లతో కుమ్మరిగూడ నుంచి కొత్తూరు వరకు సీసీ రోడ్డు నిర్మించారు.
– ఎన్హెచ్-44 తిమ్మాపూర్ నుంచి రైల్వే అండర్ పాస్ వరకు 1.2 కిలోమీటర్ల సీసీ రోడ్డును నిర్మించారు.
– రైల్వే అండర్ పాస్ నుంచి 11వ వార్డు వరకు 2 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణం, నేషనల్ హైవే 7 నుంచి కొత్తూరు రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్డు వేశారు.
– మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్డ నిర్మాణం కోసం రూ.12 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.
ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి
కొత్తూరు ప్రజల సహకారం ఉంటే మరింత అభివృద్ధి చేస్తాం. మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారం మరువలేనిది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తున్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో వై జంక్షన్ నుంచి కొత్తూరు రైల్వే బ్రిడ్జి వరకు రోడ్డు పనులకు త్వరలో ప్రారంభిస్తాం. అంతే కాకుండా దర్గారోడ్డును కూడా వినాయకస్టీల్ వరకు సుందరంగా తీర్చిదిద్దుతాం.
–అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే షాద్నగర్