రంగారెడ్డి, మే 25, (నమస్తే తెలంగాణ) : ఆధునిక సాగు పద్ధతులతో అన్నదాతలు అధిక లాభాలు పొందేలా రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ వినూత్న కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించింది. జిల్లాలోని 83 క్లస్టర్లలో ఐదు రకాల వినూత్న పద్ధతులపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. డ్రై-వెట్ డైరెక్ట్ వరి సాగు పద్ధతి, భాస్వరం జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువు, విడుతల వారీగా ఎరువుల వాడకం, ఒకేసారి పత్తి తీసే పద్ధతితో పాటు సాగులోని మెళకువలపై అధికారులు రైతులకు వివరించనున్నారు. ఈ వానకాలం సీజన్లో 4,88,597 ఎకరాల్లో ఆయా పంటల సాగుకు జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. ఈ ఏడాది పత్తి, కంది, జొన్న పంటల సాగును పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విత్తనాలతో పాటు యూరియా, డీఏపీ, ఎస్ఎస్పీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచగా, పచ్చిరొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీతో వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్నది.
ఈ ఏడాది వానకాలం సాగులో వినూత్న కార్యక్రమాలను చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికను రూపొందించింది. జిల్లాలోని ప్రతి క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఐదు వినూత్న కార్యక్రమాలను చేపట్టేందుకు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేలా ప్రోత్సహించడంపై దృష్టిపెట్టారు. వానకాలంలో డ్రై&వెట్ డైరెక్ట్ వరి సాగు పద్ధతి, భాస్వరం జీవన ఎరువుల వాడకం, పచ్చిరొట్ట ఎరువులు, విడుతలవారీగా ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు అధిక సాంద్రత పద్ధతిలో ఒకేసారి పత్తి తీసే పద్ధతులపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించనున్నారు.
జిల్లాలోని 83 క్లస్టర్లలో ఐదు వినూత్న పద్ధతులపై రైతులకు ఊరూరా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు వానకాలం సీజన్లో ఆయా పంటల సాగుకు సంబంధించి ఇప్పటికే సాగు ప్రణాళికను వ్యవసాయాధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది పత్తి, కంది పంటల సాగును పెంచుతూ సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ తయారు చేసింది. వర్షాలు ప్రారంభమైతే వచ్చే నెల మొదటి వారం నుంచి విత్తనాలు నాటే ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సరిపోను విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
సాగులో 5 వినూత్న పద్ధతులు
ఆధునిక పద్ధతుల ద్వారా డ్రై&వెట్ డైరెక్ట్ వరి సాగు పద్ధతులపై ప్రతి క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రతి క్లస్టర్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో 25 మంది రైతులకు సంబంధించిన 50 ఎకరాలను ఎంపిక చేసుకొని ప్రతి రోజూ సందర్శిస్తూ అన్ని దశల్లో పంటను పరిశీలించి సీజన్ మొత్తానికి పూర్తి వివరాలతో డాక్యుమెంటేషన్ చేస్తారు. అదేవిధంగా భాస్వరం జీవన ఎరువులపై ప్రతి క్లస్టర్లోని 25 మంది రైతులకు సంబంధించిన 100 ఎకరాలను ఎంపిక చేసి అవగాహన కల్పించనున్నారు.
అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకుగాను ప్రతి క్లస్టర్లో 30 మంది రైతులను ఎంపిక చేసి 150 ఎకరాల్లో పచ్చి రొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతారు. ప్రతి క్లస్టర్లో 50 మంది రైతులకు సంబంధించిన 100 ఎకరాలను ఎంపిక చేసి విడుతల వారీగా ఎరువుల వాడకంపై అవగాహన కల్పించనున్నారు. అధిక సాంద్రత పద్ధతిలో ఒకేసారి పత్తి తీసే రకాన్ని సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తారు. ఇందులో భాగంగా ఈ వానకాలం సీజన్లో మాడ్గుల మండలంలో 300 ఎకరాల్లో, ఆమనగల్లు మండలంలో 100 ఎకరాలు, తలకొండపల్లి మండలంలో 100 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్లాన్ చేశారు. అలాగే రాశి సీడ్స్ ప్రమేయంతో మాడ్గుల మండలంలో 510 ఎకరాలు, ఆమనగల్లు మండలంలో 400 ఎకరాలు, తలకొండపల్లి మండలంలో 330 ఎకరాల్లో ఒకేసారి పత్తి తీసే రకాన్ని సాగు చేసేలా ప్లాన్ చేశారు.
వానకాలంలో 4,88,597 ఎకరాల్లో సాగు
ఈ ఏడాది వానకాలం సీజన్లో 4,88,597 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. పత్తి-2,75,050 ఎకరాలు, కందులు-70,520, వరి-75 వేలు, జొన్న-15 వేలు, మొక్కజొన్న-48 వేలు, పెసలు-352, మినుములు-170, వేరుశనగ-240, ఆముదం-120, సోయాబీన్-20, ఇతర పంటలు-4125 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. గతేడాది వానకాలంలో 3,79,675 ఎకరాల్లో సాగుకాగా, ఈ ఏడాది 1,08,922 ఎకరాల్లో ఆయా పంటల సాగును పెంచుతూ నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రైతులకు అన్యాయం చేస్తున్న దృష్ట్యా వానకాలం సీజన్లోనూ వరి సాగు తగ్గించాలని నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే వరి సాగును సుమారు 60 వేల ఎకరాలకు తగ్గించాలని.. అదేవిధంగా జొన్నకు సంబంధించి గతంతో పోలిస్తే ఈ ఏడాది 10 వేల ఎకరాల వరకు పెంచుతూ నిర్ణయించారు.
ఎరువులు, విత్తనాలు సిద్ధం
వానకాలం సీజన్లో ఆయా పంటలకు సంబంధించి 26,702 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అవసరమైన విత్తనాల్లో పత్తి-5,50,100 ప్యాకెట్లు, వరి-18,750 క్వింటాళ్లు, జొన్న-600 క్వింటాళ్లు, మొక్కజొన్న-3840 క్వింటాళ్లు, పెసలు-28 క్వింటాళ్లు, కందులు-2820 క్వింటాళ్లు, మినుములు-13.6 క్వింటాళ్లు, వేరుశనగ-144 క్వింటాళ్లు, ఆముదం-3 క్వింటాళ్లు, సోయాబీన్-7 క్వింటాళ్లు, ఇతర పంటలకు సంబంధించి 495 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలను 65 శాతం మేర సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. ఎరువులకు సంబంధించి జిల్లాకు యూరియా, డీఏపీ, ఎస్ఎస్సీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 1,01,841 టన్నులు అవసరమని అంచనా వేయగా.. ప్రస్తుతం జిల్లాలో యూరియా-14,523 టన్నులు, డీఏపీ-3291, ఎస్ఎస్పీ-153, ఎంవోసీ-296, కాంప్లెక్స్ ఎరువులు-8272 టన్నులు కలిపి మొత్తం 26,537 టన్నుల మేర ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
అంతా సిద్ధం : గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
వానకాలం సాగుకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశాం. సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచాం. పత్తి సాగు చేసే రైతులు పత్తి విత్తనాలను లైసెన్సు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. హెచ్టీ పత్తి విత్తనాలపై జాగ్రత్తగా ఉండాలి. నకిలీ పత్తి విత్తనాలపై గట్టి నిఘా పెట్టాం. బీజీ-1 పత్తి విత్తనాల ప్యాకెట్-రూ.635, బీజీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్-రూ.810గా నిర్ణయించాం.