రంగారెడ్డి, మే 23, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొండాపూర్ ప్రభుత్వాసుత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. సోమవారం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాకు కొత్తగా మంజూరైన 22 బస్తీ దవాఖానలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని పలు పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యుల పనితీరుపై మంత్రి హరీశ్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
హయత్నగర్ దవాఖానలో నెలకు కేవలం 39 ప్రసవాలు జరుగుతుండగా ముగ్గురు గైనకాలజిస్టులు, షాద్నగర్లో నెలకు 150కిపైగా ప్రసవాలు జరిగితే ఒక్క గైనకాలజిస్టు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు రాజేంద్రనగర్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న సుగుణను షాద్నగర్ ప్రభుత్వాసుపత్రికి వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని పీహెచ్సీల్లో రేడియాలజీ యంత్రం ఉన్నా వైద్యులు లేకపోవడం, వైద్యులున్న చోట రోగులు లేకపోవడమేంటన్నారు. రాజేంద్రనగర్ పీహెచ్సీలో నెలకు కేవలం 3 ప్రసవాలే జరుగడం, ఐదుగురు వైద్యులున్న రాజేంద్రనగర్ పీహెచ్సీలో కేవలం మూడు ప్రసవాలు జరుగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యులు తమ పనితీరు మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు.
త్వరలో 13 వేల వైద్యుల ఖాళీలు భర్తీ
త్వరలో 13 వేల వైద్యుల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. కొత్తగా నియామకాల ద్వారా వచ్చే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని, ఈ నిబంధన కొత్త వైద్యులకు మాత్రమే వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ప్రజలకు ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. వైద్యులు మందులు బయటకు రాయకూడదని, మందుల కొరత లేకుండా మందుల కొనుగోలు నిమిత్తం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు పీజీ సీట్లలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ 30 శాతం రిజిర్వేషన్ కల్పించామని, ఫీజు లేకుండా చదివిస్తున్నాం కాబట్టి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.
అనవసరంగా సిజేరియన్లు చేయవద్దు
అనవసరంగా సిజేరియన్లు చేయవద్దని, సీ సెక్షన్ పారామీటర్లలో 69 శాతంతో ముందున్నామని, దీన్ని తగ్గించాలని, గ్రామస్థాయి నుంచి ఆశవర్కర్లు, వైద్య సిబ్బంది సమన్వయంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. డెలివరీ అయిన తర్వాత మొదటి గంట గోల్డెన్ అవర్ అని, ఆ గంటలో శిశువులు తల్లి పాలకు దూరమవుతున్నారని, గోల్డెన్ అవర్లో తల్లి పాల వలన చురుకుగా, శారీరకంగా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారని, ఎదుగుదల ఉంటుందన్నారు. అయితే మన రాష్ట్రంలో 36 శాతం మాత్రమే మొదటి గంట తల్లి పాలు తాగుతున్నారని, మరో 64 శాతం దూరమవుతున్నారని, దీనికి ప్రధాన కారణం సిజేరియన్లేనని మంత్రి పేర్కొన్నారు. కొన్ని దవాఖానల్లో ముహుర్తాలు చూసుకొని ఆపరేషన్లు చేస్తున్నారని, సహజంగా దేవుడిచ్చిన సాధారణ ప్రసవాలపై ప్రజలు, గర్భిణుల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దవాఖానల బలోపేతానికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు. దవాఖానల్లోని వైద్య పరికరాల మరమ్మతులను 24 గంటల్లో చేయాలని, వైద్య పరికరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, ప్రకాశ్గౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ పాల్గొన్నారు.