నందిగామ, మే 23: నిరు పేదలందరికీ సొంత గూడు ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరితపిస్తున్నది. అందులో భాగంగానే రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వమే పేదలకు ఇండ్లు కట్టించి వారి సొంతింటి కలను నెరవేర్చుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్బెడ్ రూం ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి..
రూ. ఆరు కోట్లకుపైగా నిధులతో నిర్మాణం
నందిగామ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి పక్కన 120 రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం ఇక్కడ గజం ధర రూ.పది వేల వరకు పలుకుతున్నది. ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 6,04, 80,000 నిధులను మంజూరు చేసింది. ఆ పనులను షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. జీ+2
విధానంలో ఐదు బ్లాక్లుగా 120 రెండు పడకల ఇండ్లను నిర్మించారు. ప్రతి ఇంటిలో రెండు బెడ్ రూములతోపాటు ఒక హాలు, వంట గది, బాత్రూంను నిర్మించారు.
స్థానికుల హర్షం..
నందిగామ మండల కేంద్రంలో చేపట్టిన 120 రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులు నెల రోజుల క్రితమే పూర్తి కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా నిరుపేద లబ్ధిదారులను గుర్తించి డబుల్బెడ్ రూం ఇండ్లను కేటాయించనున్నట్లు వారు చెప్పారు. నందిగామలో రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు మండలవాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదలకు ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి పం పిణీ చేసింది. నందిగామలో చేపట్టిన 120 రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులు కూడా నెల రోజుల క్రితమే పూర్తయ్యాయి. త్వరలోనే ఆ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నందిగామలో ఇండ్ల నిర్మాణానికి అత్యధిక నిధులను మంజూరు చేసి త్వరగా పనులను పూర్తి చేయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– ఈట గణేశ్, జడ్పీ వైస్ చైర్మన్
ప్రారంభానికి సిద్ధంగా ఇండ్లు..
నందిగామ మండలంతోపాటు అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు. నందిగామలో చేపట్టిన 120 డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయడం సంతోషకరం. నిరుపేదల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు.
– జిల్లెల్ల వెంకట్రెడ్డి, నందిగామ సర్పంచ్