కడ్తాల్, మే 23 : తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో రూ.26.49 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్, రూ.12.50 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, ఏక్వాయిపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.4 లక్షలు, చరికొండ గ్రామంలో రూ.10 లక్షలతో గొల్లకురుమల సంఘం భవన నిర్మాణ పనులను జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్లు భాగ్యమ్మ, భారతమ్మ, సుగుణ, ఎంపీటీసీ ఉమావతితో కలిసి జైపాల్యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు.
స్వరాష్ట్రంలోనే గ్రామాలు, తండాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తున్నదని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందని, నూతన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో రాష్ట్రంలో శాశ్వతంగా మంచి నీటి సమస్య తీరిందన్నారు. రూ.43 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారని పేర్కొన్నారు. కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నదన్నారు.
మైసిగండి గ్రామం నుంచి గోవిందాయిపల్లి మీదుగా మర్రిపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, బీసీ కులాలకు కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ భాగ్యమ్మ ఎమ్మెల్యేని కోరారు. అంతకుముందు ఏక్వాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్లు కృష్ణయ్యయాదవ్, యాదయ్య, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్లు నర్సింహ, ముత్యాలు, నాయకులు గంప శ్రీను, జంగయ్యగౌడ్, సతీశ్రెడ్డి, సాయిరెడ్డి, అనంతరెడ్డి, భాస్కర్రెడ్డి, తహసీల్దార్ మహేందర్రెడ్డి, ఎస్ఐ హరిశంకర్గౌడ్, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో మధుసూదనాచారి, డీఈఈ సుదర్శన్, సందీప్, ఏఈలు పరమేశ్, శ్రావ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.