మొయినాబాద్ , మే 23 : పంట వేసిన అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చి ఆదాయం పొందే పంటలు ఆకుకూరలు, కూరగాయల సాగు. రైతులు పంటలు వేసిన తరువాత చీడపీడలు ఆశించకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, పుదీనా, మెంతికూర, పుంటికూర, కొత్తిమీర, కరివేపాకు ప్రధానమైనవి. వీటిలో లవణాలు, విటమిన్లు, పీచు పదార్థం అధికంగా ఉండటంతో మార్కెట్లో గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. దీంతో పాటు తక్కువకాలం, తక్కువ ఖర్చుతో పండించే అవకాశం ఉండటంతో చాలా మంది రైతులు ఆకుకూరల సాగుకు ముందుకు వస్తున్నారు. మొయినాబాద్ మండలం నగరానికి అతి చేరువలో ఉండటం, కూరగాయల మార్కెట్ మండల రైతులకు అతి చేరువలో అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఆకుకూరలు, కూరగాయల సాగు ఎక్కువ మొత్తంలో చేస్తుంటారు.
నేల స్వభావం ముఖ్యం
ఆకుకూరలు సాగుచేసే భూమిని నాలుగైదు సార్లు దున్ని పెల్లలు లేకుండా చూసుకోవాలి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 300 కిలోల వేపపిండి, 100 కిలోల సూపర్ఫాస్పెట్, 10 కిలోల జింక్ సల్ఫెట్, 2 కిలోల గ్రాన్యుబోర్, 100 కిలోల తయారు చేసిన ట్రైకోడెర్మా, 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి విత్తనాలను చల్లుకోవాలి. ఆయా ప్రాంతాల కు అనువైన సాధారణ రకాలు, హైబ్రిడ్ రకాలను వేసుకోవచ్చు. భూసారాన్ని బట్టి రసాయన ఎరువులు వాడితే మం చిది. భూసార పరీక్షలు చేసుకొని ఎరువులు వాడితే ఏ మో తాదులో ఎరువులు వాడాలో రైతుకు అర్థం అవుతుంది.
సాగులో గమనించాల్సిన విషయాలు
తోటకూర విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి ఇసుకతో కలిపి చల్లుకోవాలి. ఎకరానికి 600 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. విత్తనానికి 10 కిలోల ఇసుక కలిపి మడుల్లో పలుచగా చల్లుకోవాలి. తర్వాతా విత్తనంపై పలుచటి పొరలా మెత్తటి మట్టి చల్లాలి.
-పాలకూర విత్తనబంతిలో 2-3 విత్తనాలు ఉంటాయి. విత్తనాలను 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. లోతు ఎక్కువైతే మెలక సరిగ్గా రాదు.
-కొత్తిమీరను విత్తే సమయంలో రెండు బద్దలుగా చే యాలి. లేకుంటే గింజలు ఆలస్యంగా మొలకెత్తుతాయి. మొలకశాతం బాగా తగ్గుతుంది. గింజలను నేలపై పోసి చె ప్పులతో సున్నితంగా రుద్దాలి. ఎకరానికి 4-5 కిలోల విత్తనాలు సరిపోతాయి. హైబ్రిడ్ విత్తనాలను బద్దలు చేయకుం డా వేస్తున్నారు. అలా వేయడం వల్ల విత్తనాలు మొలకెత్త వు. అప్పుడు ఆశించిన రీతిలో పంట దిగుబడి రాదు.
-మెంతి పప్పుజాతి పంట కాబట్టి మొదటిసారిగా విత్తినైట్లెతే విత్తేముందు సంబంధిత రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించిన్నైట్లెతే వాతావరణంలోని నత్రజనిని గ్రహిం చి మొక్కల పెరుగుదల శాఖీయ ఉత్పత్తి బాగుంటుంది.
– కరివేపాకు విత్తనాలను పండు నుంచి వేరుచేసిన వెంటనే విత్తుకోవాలి. ఆరితే మొలకశాతం తగ్గుతుంది.
-విత్తన శుద్ధ్దికి జీవశిలీంధ్రాన్ని ట్రైకోడెర్మాను 8 గ్రాములు కిలో విత్తనానికి అంటించి విత్తితే విత్తనకుళ్లు , వేరుకుళ్లు అంతగా రావు.
-విత్తనం విత్తిన 48 గంటలలోగా భూమిలో తేమను చూసుకొని లీటర్ నీటికి, 4 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలుపు మందును పిచికారీ చేయవచ్చును.
-పైపాటుగా పంట ఎదుగుదలకు లీటరు నీటికి 5 గ్రాముల 19ః19ః19 పాలీపిడ్ను పిచికారీ చేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంట అవసరాన్ని బట్టి నీరు అందించాలి. నీరు ఎక్కువైతే వేరుకుళ్లు, కాండం కుళ్లు వచ్చే అవకాశం ఉంది. స్పింక్లర్ల స్ప్రే ద్వారా నీరు అందించడం మంచిది. దీని వల్ల ఆకులపై ఉండే పురుగుల గుడ్లు, నల్లులు, దుమ్మూధూళి రాలిపోతాయి. పేనుబంక, ఆకుముడత, ఆకులు తినే గొంగళి పురుగుల నివారణకు రసాయన మందులు వాడకుండా వేపమందులు వాడటం మంచిది. రసాయన మందులు వాడితే కనీసం వారం రోజుల తర్వాత పంట కోయాలి. కత్తిరించే ఆకు పంటలకు కోత తర్వాత ఎకరాకు 10 కిలోల యూరియా వేస్తే, మళ్లీ పంటకు వస్తుంది. ఆకులపై తేమ ఎక్కువగా ఉంటే కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకు ఆరకుండా తక్కువ శాతం తేమ మాత్రమే ఉండాలి. ఆకులను మార్కెట్కు తరలించేటప్పుడు గోనసంచులకు బదులు కట్టలు కట్టి గాలి ప్రసరించే ట్రేలలో రవాణా చేయడం మంచిది.
భూసారాన్ని బట్టి ఎరువులు వేయాలి
ఆకుకూరల సాగులో రైతులు కొన్ని మెళకువలు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చు. తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. రైతు ఆకుకూరలు సాగు చేసుకునే ముందు భూసార పరీక్షలు చేయించుకుంటే మంచిది. భూసారాన్ని బట్టి ఎరువులు వాడటానికి అవకాశం ఉంటుంది. అధిక ఎరువులు వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అనుకుంటారు. కానీ రైతులు భూసారాన్ని బట్టి ఎరువులు వేసుకోవడం మంచిది.
-ఎన్ రాగమ్మ, మండల వ్యవసాయ అధికారి