రంగారెడ్డి, మే 23, (నమస్తే తెలంగాణ) : జూన్ 3 నుంచి 18 వరకు జరుగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలుచేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం బషీరాబాగ్లోని తన చాంబర్లో నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంపై మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో మంత్రి సబితాఇంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతి జరగాలని, పచ్చదనం-పారిశుధ్యం వెల్లివిరియాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందేలా అడుగులు వేయాలని, ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి విజయవంతం అవుతుందని మంత్రి తెలిపారు. వార్డులవారీగా పట్టణ ప్రగతి జరుగాలని, అందుకోసం ప్రత్యేకంగా వార్డుకు ఒక అధికారిని నియమించాలన్నారు. వార్డుల్లో హరిత ప్రణాళికను రూపొందించి, విరివిగా మొక్కలు నాటాలని, వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకుగాను అనువైన స్థలాలను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమైన సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతిపాదించిన వైకుంఠధామాల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని, మిషన్ భగీరథ పథకంలో భాగంగా వైకుంఠధామాలకు నీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు ప్రస్తుత కార్యాచరణ రూపొందించుకొని పనులు చేపట్టాలని.. పట్టణాభివృద్ధి శాఖ, నీటి సరఫరా విభాగం అధికారులు సమన్వయంతో వ్యవహరించి నీటి సరఫరా పైప్లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. అనంతరం రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి సూచించారు. గత వర్షాకాలం ఎదురైన సమస్యలు ఈ ఏడాది వానకాలంలో ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ ఉండేలా చర్యలు
హరితహారంలో భాగంగా ప్రతి కాలనీ, ప్రతి వీధిలో అవెన్యూ ప్లాంటేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అమయ్కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత మార్కెట్ల నిర్మాణాలను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని, వైకుంఠధామాలను పూర్తి చేయాలని, పబ్లిక్ టాయిలెట్స్ను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ పాల్గొన్నారు.