రంగారెడ్డి, మే 22 (నమస్తే తెలంగాణ) : హరితహారం కార్యక్రమంతో పల్లెలు, పట్టణాలు పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే గ్రీనరీ శాతం పెరిగినట్లు జిల్లా అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సైతం మరింత పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిధుల సమస్య తలెత్తకుండా ‘హరితనిధి’ కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టర్ల నుంచి నగదును సేకరించి హరితనిధి ఖాతాలో జమ చేశారు. గడిచిన రెండు నెలల్లో సుమారుగా రూ.10 లక్షలు జమైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఎనిమిదో విడుత హరితహారంలో కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రణాళికను సైతం రూపొందిస్తున్నది. ఇందుకు జిల్లాలోని 560 నర్సరీల్లో పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, బొప్పాయి, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను సిద్ధం చేయగా, మరిన్ని మొక్కల పెంపకానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత సమస్య తలెత్తకుండా ప్రభుత్వం హరితనిధి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతినెలా హరితనిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు తదితరుల నుంచి సేకరించిన డబ్బులు నేరుగా హరితనిధి ఖాతాలో జమ అవుతున్నాయి. హరితనిధిలో ఏప్రిల్ మాసం నుంచి నిధులు ప్రభుత్వం నిర్ణయించిన ఆయా వర్గాల నుంచి నిధులు జమవుతున్నాయి. జిల్లాలో రెండు నెలల్లో సుమారు రూ.10 లక్షల వరకు హరితనిధిలో జమైనట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన హరితనిధి కార్యక్రమంతో జిల్లాలో మరింత పచ్చదనం పెంపొందనున్నది.
హరితనిధిలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ప్రతినెలా రూ.500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల నుంచి రూ.100, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్ల నుంచి రూ.100, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీ, జడ్పీటీసీల నుంచి రూ.50లు, మున్సిపల్ కౌన్సిలర్ల నుంచి ప్రతినెలా వేతనం నుంచి హరితనిధికి సేకరించనున్నారు. అదేవిధంగా అన్ని రకాల కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల నుంచి 0.1శాతం, వ్యాపార, వాణిజ్య లైసెన్స్ రెన్యూవల్ నుంచి రూ.1000, భూ క్రయ, విక్రయాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి రిజిస్ట్రేషన్కు రూ.50 చొప్పున హరితనిధి కింద జమ అవుతుంది.
అదేవిధంగా విద్యార్థుల్లోనూ హరితహారంపై అవగాహన పెంచేందుకు మొక్కల సంరక్షణలో వారి పాత్ర ఉందనే భావన కలిగించేందుకు ప్రవేశాలు పొందే సమయంలో డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో రూ.25లు, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు రూ.15లు, ప్రతి స్కూల్ అడ్మిషన్లకు రూ.10లు, వృత్తివిద్యా కాలేజీ అడ్మిషన్లకు సంబంధించి రూ.100లను హరితనిధి కింద ప్రత్యేకంగా జమ చేయనున్నారు. హరితహారం కార్యక్రమానికి ఎలాంటి నిధుల కొరత సమస్య లేకుండా నిధులు ప్రతి ఏటా హరితహారం కార్యక్రమం నిర్వహణకు ఖర్చు చేయనున్నారు.
ఈ ఏడాది లక్ష్యం కోటి మొక్కలు..
జిల్లాలో ఎనిమిదో విడుత తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో 2022-23 సంవత్సరానికి నాటాల్సిన కోటి మొక్కలకు సంబంధించి టార్గెట్ను జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. జిల్లా అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకు నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)తోపాటు ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలోనూ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ యంత్రాంగం ప్లాన్ చేసింది.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతీ మొక్కకూ జియోట్యాగింగ్ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన హరితనిధి కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నది. పర్యావరణాన్ని పెంపొందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ప్రతి ఏటా హరితోద్యమం..
జిల్లాలో హరితహారం, పల్లెప్రకృతివనాలు, మండలానికో బృహత్వనంతో జిల్లా అంతటా పచ్చదనం కళకళలాడుతున్నది. జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17 సంవత్సరంలో 1.39 కోట్లు, 2017-18 71.04 లక్షలు, 2018-19లో 86.12 లక్షలు, 2019-20లో 1.02 కోట్లు, 2021-22లో 89 లక్షల మొక్కలను జిల్లాలో నాటారు. ఈ ఏడాది కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, బొప్పాయి, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసిన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
హరితహారానికి నిధుల కొరత ఉండదు..
హరితనిధి కార్యక్రమంతో హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన వారి నుంచి ప్రతినెలా నేరుగా హరితనిధి ఖాతాలో జమ కానుంది. ఈ ఏడాది హరితహారం కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించాం. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నాం.
– జానకీరామ్, జిల్లా అటవీ శాఖ అధికారి