యాచారం, మే 22 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలనే నిబంధనను పెట్టింది. గతంలో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసుకున్న రైతులు సైతం మరోమారు ఈ ప్రత్యేక పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసింది. చేసుకోని వారికి నిధులు సమకూరేదిలేదని ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నూతన నిబంధన నేపథ్యంలో మండలంలో వ్యవసాయాధికారులు క్లస్టర్ల వారీగా మీసేవలో ఈ-కేవైసీ చేసుకున్న రైతుల వద్ద నుంచి రైతు వేదికల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రత్యేక సమావేశాల ద్వారా రైతులకు దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 31వ తేదీలోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నిజమైన రైతులకు లబ్ధి చేకూరేందుకే..
మూడు విడుతలుగా రూ.2వేల చొప్పున సంవత్సరానికి రూ.6వేలు పంట పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందజేస్తున్నది. ఇప్పటికీ పదిసార్లు ఎలాంటి షరతుల్లేకుండా డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసిన కేంద్ర సర్కారు మొదటిసారిగా రైతులకు ఆంక్షలు విధించింది. తప్పుడు ఖాతాల ద్వారా అనర్హులు లబ్ధి పొందకుండా నిజమైన రైతులకు మాత్రమే సాయమందించడానికి ఈ-కేవైసీని అమలు చేసినట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కొందరు చనిపోయినప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకొచ్చేందుకే తప్పనిసరి ఆధార్ లింక్ను ప్రవేశపెట్టిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆధార్ అనుసంధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
అర్హులెవరంటే..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించాలంటే 2019, జనవరి31 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిఉన్న రైతులు మాత్రమే అర్హులు. వీరు మాత్రమే ఈనెల 31లో తమ ఆధార్ను అనుసంధానం చేసుకోవాలి. 2019, జనవరి31 తరువాత భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని నూతన పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన వారు దీనికి ప్రస్తుతం అనర్హులు. ఆ రైతులు ఈ-కేవైసీ చేసుకోవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
7800మంది లబ్ధిదారులు
మండలంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గతంలో 7800ల మంది రైతులున్నారు. వీరంతా తిరిగి ఈ-కేవైసీ చేసుకోనున్నారు. మండలంలోని మేడిపల్లి, యాచారం, మాల్, చౌదర్పల్లి గ్రామాల క్లస్టర్ రైతువేదికల్లో అధికారులు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రోజుకు 200ల నుంచి 300ల వరకు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 3,000లకు పైగా రైతులు ఈ-కేవైసీ చేసుకున్నట్లు వ్యవసాయాధికారి సందీప్కుమార్ తెలిపారు. మిగతా రైతులు గడువు ముగిసేలోపు చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే వారిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించడంతో పాటు రైతులు డబ్బులు కోల్పోయే ప్రమాదముందని తెలిపారు.
దరఖాస్తు విధానం ఇలా..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను పొందేందుకు రైతులు తమ ఆధార్కార్డు, బ్యాంకు పాస్బుక్, పట్టదారు పాస్బుక్, ఫోన్నంబర్ వివరాలను మీసేవాలో సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే మండల వ్యవసాయాధికారి, ఏఈవోలను నేరుగా కలిసి తమ దరఖాస్తులను అందజేయవచ్చు. రైతులు సొంతంగా www.pmkisan.gov.in ఓపెన్ చేసి అందులో ఈ-కేవైసీ అప్డేట్ వస్తుంది. ఈ-కేవైసీపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ను నమోదు చేయాలి. ఆధార్ నంబర్ నమోదైన ఫోన్నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని గెట్ పీఎం కిసాన్ ఓటీపీ బాక్స్లో నమోదు చేయాలి. అనంతరం వచ్చే మరో ఓటీపీని రెండోసారి నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఫోన్నంబర్ లింక్లేని వారునేరుగా మీసేవలో బయోమెట్రిక్ విధానం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు.
ఈ-కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా ఈ నెల 31 ఆఖరి తేదీలోపు ఆధార్ కార్డుతో ఈ-కేవైసీని చేయించుకోవాలి. ఇప్పటికే రైతులకు ముమ్మరంగా అవగాహన కల్పించాం. మీ సేవ, ఈసేవ, ఆన్లైన్, మొబైల్ యాప్, బయోమెట్రిక్ ద్వారా రైతులు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. దీంతో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు జమవుతాయి. చేసుకోనివారిని అనర్హులుగా గుర్తిస్తారు.
– సందీప్కుమార్, మండల వ్యవసాయాధికారి