వికారాబాద్ జిల్లాలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 10,898 ప్రసవాలు
పరిగి, మే 22: సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యంతోపాటు మాతాశిశు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలతో వికారాబాద్ జిల్లాలో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. ఏడాదిగా జిల్లాలోని ప్రసవాల సం ఖ్యను పరిశీలిస్తే ప్రైవేట్లో కంటే సర్కారు దవాఖానల్లోనే అధికంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021 ఏప్రిల్ నుంచి గత ఏప్రి ల్ నెల వరకు జిల్లాలోని సర్కారు దవాఖానల్లో 10,898 ప్రసవాలు జరగగా, అందులో 6,630 సాధారణ ప్రసవాలు, 4,268 సిజేరియన్లు ఉండటం గమనార్హం.
ప్రైవేట్లో 80 శాతం సిజేరియన్లు..
జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో సుమారు 80 శాతం వరకు సిజేరియన్లు అయినట్లు అధికారు లు తెలిపారు. జిల్లాలోని 27 ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్హోమ్ల్లో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఏప్రిల్ వరకు మొత్తం 4,040 ప్రసవాలు జరుగగా.. అందులో సాధారణ ప్రసవాలు 789 ఉండగా… సిజేరియన్లు 3,251 జరిగాయి. దీని ద్వారా సిజేరియన్లు 80 శాతం వరకు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే కేవలం డబ్బులను గుంజడమే ధ్యే యంగావైద్యులు సిజేరియన్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు
సర్కారు దవాఖానల్లో డెలివరీలు జరిగితే ప్రభు త్వం కేసీఆర్ కిట్లతోపాటు ఆడ శిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువైతే రూ.12వేలు అంది స్తున్నది. అంతేకాకుండా గర్భిణులను అమ్మఒడి వాహనాల్లో ప్రతినెలా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత తిరిగి వారిని ఇండ్ల దగ్గర వదిలిపెట్టడం జరుగుతున్నది. సర్కారు దవాఖానల్లో ప్రసవాల అనంతరం తల్లీబిడ్డలను క్షేమం గా ఇండ్ల వద్ద దింపుతున్నది. తద్వారా సర్కారు దవాఖానల్లో రోజురోజుకూ డెలివరీల సంఖ్య పెరుగుతున్నది.
జిల్లాలోని తాండూరు జిల్లా దవాఖాన ప్రసవాల్లో రాష్ట్ర స్థాయిలో నిలిచి ఇటీవలే అవార్డును కూడా అందుకున్నది. దీంతోపా టు మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం రూ. 20 కోట్లు ఖర్చు చేసి తాండూరులో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సిక్ న్యూ బర్న్ కేర్ యూనిట్, న్యూట్రిషనల్ రిహాబిలిటేషన్ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సిక్ న్యూ బర్న్ కేర్ యూనిట్లో పుట్టుకతో తక్కువ బరువు గల శిశువులు, నెలలు నిం డకుండానే జన్మించిన శిశువులు, బరువు తక్కువగా ఉన్న వారి సంరక్షణకు ప్రత్యేకంగా బెడ్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో శిశువులు ఉండటంతో శిశు మరణాల సంఖ్య భారీగా తగ్గుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. డెలివరీలు జరిగిన తర్వాత తల్లీబిడ్డలు సంతోషంగా ఇంటికి చేరుకుంటున్నారు.
గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం..
ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో గర్భిణులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుండటంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. జిల్లాలోని 154 ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆశ వర్కర్లు గర్భిణుల వివరాలను రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు వారిని ఆరోగ్య పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్సీలకు తీసుకెళ్తున్నారు. అక్కడ సిజేరియన్లతో కలిగే నష్టాలను వివరించడంతోపాటు సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనాలపై చైతన్యం కల్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది.
–డాక్టర్ తుకారాంభట్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి