ఆర్కేపురం, మే 22: బస్తీ దవాఖానలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు మధుమేహం, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న అనేక మంది పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. ఒక్కో డివిజన్లో రెండు బస్తీ దవాఖానలు అందుబాటులోకి రావడంతో ఆస్పత్రులకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సరూర్నగర్ డివిజన్ పరిధిలో బస్తీలతో పాటు కాలనీలు ఉన్నాయి. అంబేద్కర్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో అదనంగా మరొకటి భగత్సింగ్నగర్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ డాక్టర్తో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ఏఎన్ఎం, ఒక మిడిసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వైద్య సేవలందిస్తున్నారు. సరూర్నగర్ డివిజన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సైతం ఉండటంతో ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకునే అవసరం లేకుండా పోయింది.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు కార్పొరేట్ తరహాలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. అంబేద్కర్నగర్ బస్తీలో ఏర్పాటు చేసిన దవాఖానలో రోజుకు 60 నుంచి 80 మంది వైద్యం కోసం వస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు ఇస్తున్నాం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా బస్తీ దవాఖానలు పనిచేస్తున్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.
– అర్చన, మెడికల్ అధికారి
వైద్య సేవలు బాగున్నాయి
రెక్కాడితేగాని డొక్కాడని పేద ప్రజలు నివసిస్తున్న బస్తీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం అభినందనీయం. బస్తీ దవాఖానలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వైద్యులు పరీక్షించి మందులు కూడా ఇస్తున్నారు. వైద్యులు, సిబ్బంది రోగులను చాలా మంచిగా చూస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు బాగున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
– ఆర్తీ, స్థానికురాలు