తాండూరు, మే 21: రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసి తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అధిక దిగుబడులిచ్చే కంది వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించారు. రాష్ట్రంలోనే తాండూరు ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం ఈ పంట సాగుకు అనువైనదిగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తేల్చారు. దీంతో కంది పంట సాగుకు రైతులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కందికి ఎండు తెగులు, గొడ్డు తెగులు ఎక్కువగా సోకుతున్నది. దీంతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు ఖరీఫ్ సీజన్లో సాగు చేసే కంది పంటకు ఎండు తెగులు, గొడ్డు తెగులు సోకకుండా ఉండాలే వంగడాలను రూపొందించారు. వాటిలో తెలంగాణ కంది-3 (టీడీఆర్జీ-59), హనుమ (టీడీఆర్జీ-4), ఆశ (ఐసీపీఎల్ 87119) ఉన్నాయి. ఈ కంది విత్తనాలనే రైతులు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
తెగుళ్లు, పచ్చ పురుగును తట్టుకునేలా..
రైతులు కంది సాగులో అధిక దిగుబడులను సాధించేందుకు తెగుళ్లు, పచ్చ పురుగును తట్టుకునే రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. తాము రూపొందించిన వంగడాలతో 170 నుంచి 180 రోజుల పంట కాలంతో ఎకరానికి 7 నుంచి 9 క్వింటాళ్ల వరకు దిగుబడులను సాధించవచ్చునని తెలుపుతున్నారు.
తెగుళ్ల నివారణ..
కంది తెగులు నివారణకు రైతులు 3 నుంచి 4 అంగులాల లోతు దుక్కులు దున్నుకోవాలి. ట్రైకోడర్మా పొడిని భూమి దుక్కుల సమయంలో వేయాలి. నేలలో తేమ ఉన్న సమయంలో ఇది బాగా పని చేస్తుంది. ఎకరానికి 4 నుంచి 5 కిలోల పొడిని వాడాలి. పెంట ఎరువుతో కలిపి వారం రోజుల పాటు నిల్వ ఉంచి మురిగిన తరువాత పొలంలో చల్లాలి. దీంతో తెగుళ్లు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
100 శాతం అధిక దిగుబడులు
రైతులు పంటల సాగులో సొంత పద్ధతులను మానుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించే నూతన పద్ధ్దతులను పాటిస్తే అధిక దిగుబడిని సాధించొచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ సుధాకర్, సుధారాణి సూచించారు. ముఖ్యంగా కంది పంటలో మొలక నాటు పద్ధతిని అనుసరిస్తే వంద శాతం అధిక దిగుబడులను సాధించవచ్చునని పేర్కొంటున్నారు. పదేండ్లుగా కందిలో మొలక నాటు విధానంలో చేసిన పరిశోధనలతో ఎకరానికి 12-15 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించే మార్గం తెలిసిందన్నారు. ఖరీఫ్లో కంది విత్తుకునే సమయం కన్నా 30 రోజుల ముందుగానే పాలిథిన్ సంచుల్లో నారు పోసుకొని పెంచితే ఈ అధిక దిగుబడులు సాధించొచ్చన్నారు. నాటు పద్ధ్దతికి సమయం లేకపోతే సాధారణ సాగు విధానంలోనే నూతన పద్ధ్దతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు,సలహాలు పాటిస్తే ఎకరానికి 6 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని వారు తెలిపారు.
నూతన పద్ధ్దతులు, జన్యు పరిశోధనలు..
కంది పంట సాగులో యాజమాన్య పద్ధ్దతులు, వినూత్న విధానాలపై పరిశోధనలు చేయనున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. స్కేర్ ప్లాంటింగ్ పద్ధ్దతిలో (పత్తి విత్తనం నాటే విధానం), ట్రాన్స్ప్లాంటింగ్ సిస్టమ్ (నారును నాటుకునే పద్ధతిలో) ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ బ్రీడింగ్ విధానాలతోపాటు అధిక దిగుబడులిచ్చే వంగడాలపై జన్యు పరిశోధనలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. బ్రీడింగ్, సస్యశాస్త్రం, పెథాలజీ (సస్యరక్షణ)లపై కూడా పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారు. అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిసాట్) సహకారంతో జన్యు పరిశోధనలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కల్లో జన్యుపరమైన పరిశోధనలకు తాండూరు వ్యవసాయ పరిశోధనాస్థానంలో సెంట్రీఫ్యూజ్, పీసీఆర్ మిషన్, ఇంక్యుబెటర్లు, -80 డిగ్రీల సెల్సియస్ ఉండే డీఫ్రీజుల వంటి పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 24 నుంచి విక్రయాలు..
తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో తయారు చేసిన తెలంగాణ కంది-3 (టీడీఆర్జీ-59), హనుమ (టీడీఆర్జీ-4), ఆశ (ఐసీపీఎల్ 87119) రకాల కంది విత్తనాలను ఈ నెల 24వ తేదీ నుంచి తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విక్రయించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కేజీ రూ. 130 చొప్పున 4 కేజీల కంది విత్తనాల బస్తా రూ.520 ధర ఉందన్నారు. రైతులు నేరుగా వచ్చి కోనుగోలు చేయవచ్చన్నారు.
తెలంగాణ కంది-3 (టీడీఆర్జీ-59) లక్షణాలు..
రేగడి పొలంలో సాగుకు అనుకూలం
165-175 రోజుల పంట కాలం
ఎండు తెగులు, గొడ్డు తెగులు, పచ్చపురుగును సమర్థవంతంగా తట్టుకుంటుంది.
యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 7నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
దిగుబడిలో జాతీయ స్థానం పరీక్షల్లో రెండో స్థానంలో నిలిచింది.
హనుమ (టీడీఆర్జీ-4) లక్షణాలు..
రేగడి పొలంలో సాగుకు అనుకూలం
ఈ రకం విత్తనం ఎండు తెగులు, పచ్చపురుగును సమర్థవంతంగా తట్టుకుంటుంది.
నూతన పద్ధతులు ఆచరిస్తే ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది.
నీటి వసతి, సారవంతమైన చెలక భూముల్లో సాగుకు అనుకూలం
170 నుంచి 180 రోజుల పంటకాలం.
ఆశ (ఐసీపీఎల్ 87119) లక్షణాలు…
ఐసీపీఎల్ 87,119 ఆశ కంది తాండూరు ప్రాంతానికి అనువైనది.
180 రోజుల పంట కాలం ఉండే ఈ రకం ఎండు తెగులు, గొడ్డు తెగులును తట్టుకుంటుంది.
నూతన పద్ధతులు ఆచరిస్తే ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది.
నూతన పద్ధతులతో అధిక దిగుబడులను సాధించొచ్చు..
రైతులు తమ పొలంలో ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలను సాగు చేస్తే బాగుంటుంది. ఆయా ప్రాంతాలను బట్టి ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలను సాగు చేసి నూతన పద్ధ్దతులను పాటిస్తే అధిక దిగుబడులను సాధించొచ్చు. పంట సాగులో ఇబ్బందులు, అనుమానాలొస్తే తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సంప్రదించండి.
-సి.సుధాకర్, వ్యవసాయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు