షాద్నగర్రూరల్, మే 20 : రైతుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది. ప్రభుత్వ పథకాలతో రైతన్నలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. రైతన్నలకు ఏ విధమైన కష్టం లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నది.
విత్తనాల నుంచి దిగుబడి వరకూ..
రైతు రాజ్యం చేసేలా తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి రైతుల్లో కొండంత భరోసాను నింపింది. ఇప్పడు మరో ముందడుగు వేసింది. రైతన్నలు విత్తనం వేసినప్పటి నుంచి పంట దిగుబడి వరకు వివిధ పరికరాలు అవసరం అవుతాయి. చిన్న, సన్నకారు రైతులు పంట సాగు కోసం ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో బయట అద్దెకు పరికరాలను తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. దీంతో పండించిన పంటలో అద్దెను చెల్లించడానికే ఎక్కువ ఖర్చు అవుతుందని తెలుసుకున్న ప్రభుత్వం రైతన్నలకు తక్కువ ధరలకే వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చేలా ప్రణాళికను ఏర్పాటు చేయనున్నారు.
అద్దె పరికరాలు ఇవ్వడం ఇలా..
ప్రతి మండలంలో కస్టమ్స్ హైరింగ్ సెంటర్స్ (సీహెచ్సీ) ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీహెచ్సీ ద్వారా అవసరమైన వ్యవసాయ పరికరాలను తక్కువ అద్దెకు రైతులకు ఇచ్చేలా మండల మహిళా సమాఖ్యకు బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ పరికరాల కొనుగోలుకు స్త్రీనిధి నిధులను వెచ్చించనున్నారు. రైతులు చెల్లించే అద్దెలతో స్త్రీనిధి వడ్డీ, అసలు చెల్లించేలా మహిళా సమాఖ్య కీలకపాత్ర పోషించనున్నారు. ఇప్పటికే మహిళౠ సమాఖ్య అధికారులకు వ్యవసాయ అధికారులు సీహెచ్సీపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ ఆలోచనకు రైతన్నల హర్షం
ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం పట్ల మండల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలు అమలు కావడంతో మండలంలో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రైవేట్ వ్యక్తులు వ్యవసాయ పరికరాలను అధిక అద్దెలకు ఇవ్వడంతో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలోని పలు మండలాల్లో సీహెచ్సీ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.
రైతు సంక్షేమానికి పెద్దపీట
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. తక్కువ అద్దెతో వ్యవసాయ పరికరాలను అందజేస్తే మండల రైతులు మరింత ఆర్థికంగా ఎదుగుతారు. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
–చంద్రశేఖర్, రైతు విఠ్యాల గ్రామం, ఫరూఖ్నగర్ మండలం
గ్రామాల్లోని రైతులకు ఉపయోగం
విత్తనం వేసినప్పటి నుంచి పంటను దిగుమతి చేసే వరకు వివిధ వ్యవసాయ పరికరాలు అవసరం ఉంటాయి. చిన్న, సన్నకారు రైతులు వీటిని కొనుగోలు చేయలేక అద్దెకు తెచ్చుకుని నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్కువ అద్దెకు పరికరాలను అందజేయడం హర్షించదగ్గ విషయం. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్.
– సంపత్, సర్పంచ్ రామేశ్వరం,ఫరూఖ్నగర్ మండలం