నందిగామ, మే 20 : పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో నందిగామ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించింది. గతంలో సొంత పోలీస్స్టేషన్ భవనం లేక నందిగామ గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పోలీసు అధికారులు నూతన పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ, పోలీస్స్టేషన్ ఒకే భవనంలో విధులు నిర్వహించేవారు.
నాట్కో సహకారంతో భవన నిర్మాణం..
నందిగామలో సొంత పోలీస్స్టేషన్ భవనం లేక ఒకే హాలులో రిసెప్షన్, కంప్యూటర్, రికార్డులు, ఏఎస్ఐ క్యాబిన్ ఉండటం ఏదైనా కేసుల్లో అరెస్ట్ చేసిన నిందితులను ఉంచేందుకు ప్రత్యేక గది, లాకప్ సౌకర్యం లేదు. వివిధ పనుల నిమిత్తం పోలీస్స్టేషన్, గ్రామ పంచాయతీకి వచ్చే వారు, వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం కూడా లేదు. నూతన పోలీస్స్టేషన్ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం నందిగామ గ్రామంలో ఎన్హెచ్-7 పాతజాతీయ రహదారికి పక్కన 33 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించింది. పోలీస్స్టేషన్ భవనం నిర్మించాలనే పోలీసు అధికారులు వినతి మేరకు నందిగామ మండలం మేకగూడ గ్రామంలోని నాట్కో పరిశ్రమ యాజమాన్యం ముందుకు వచ్చింది.
నాట్కో ట్రస్ట్ ద్వారా రూ.70లక్షల విరాళం ప్రకటించడంతో అప్పటి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ వ్యయం పెరుగడంతో నాట్కో ట్రస్ట్ ద్వారా మరో రూ.30లక్షలు విరాళం అందించారు. దీంతో మొత్తం రూ.1కోటి వ్యయంతో నందిగామ పోలీస్స్టేషన్ భవనం సకల సౌకర్యాలతో అన్ని రకాల అత్యాధునిక హంగులతో చకచకా పనులు పూర్తి చేశారు. సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, కంప్యూటర్, రికార్డులు, రిసెప్షన్, విశ్రాంతి గదులు, వెయిటింగ్ గదులు, లాకప్ గదులు, వాహనాల పార్కింగ్ స్థలం ఇలా అన్ని రకాల వసతులతో నందిగామ పోలీస్స్టేషన్ భవనాన్ని తీర్చిదిద్దారు. నందిగామ గ్రామానికి కొత్తకల వచ్చింది. నూతన పోలీస్స్టేషన్ను త్వరలో ప్రారంభించి వాడుకలోకి తీసుకొచ్చే దిశగా పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు.