కొందుర్గు, మే 20 : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామాల్లో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారు. పట్టణాల్లో పార్కులు ఏర్పాటు చేసి కాలనీ వాసులు సాయంత్రం వేళలో సేద తీరేలా వెసులుబాటు కల్పించారు. గ్రామాల్లోని ప్రజలు కూడా పల్లె ప్రకృతి వనాల్లో సేదతీరేలా బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ వనాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి అందంగా కనిపిస్తున్నది.
ప్రతి పల్లెలో ప్రకృతి వనాలు
జిల్లెడు చౌదరిగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలతో పాటు మరో 20 ఆవాస గ్రామాల్లో ప్రభుత్వం ప్రభుత్వ స్థలంలో ఈ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. గ్రామంలో ప్రభుత్వానికి చెందిన అర ఎకరం నుంచి ఎకర స్థలంలో మొక్కలు నాటారు. ఎకర స్థలం ఉన్న ప్రకృతి వనంతో రెండు వేల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని 44గ్రామాల్లో 50వేల 720మొక్కలు నాటి పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలకు ప్రభుత్వం నిర్వహన ఖర్చులు చెల్లిస్తున్నది.
నీటి సౌకర్యం అందిస్తున్నాం
పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలకు ప్రతి నిత్యం నీరు అందిస్తున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా ట్యాంకర్కు డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో ప్రకృతి వనాల్లో నాటి మొక్కలు మొత్తం ఏపుగా పెరుగుతున్నాయి. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ప్రకృతి వనాలను పరిశీలిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు అందంగా తయారు అవుతున్నాయి.
–ప్రవళిక, ఏపీవో, జిల్లెడు చౌదరిగూడ మండలం