శంకర్పల్లి, మే 20 : రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా, పల్లె ప్రగతి ద్వారా నాలుగు విడుతల్లో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. గతంలో రోడ్లపై పారే మురుగునీరు, ఏపుగా పెరిగిన కలుపు మొక్కలు, చెత్తాచెదారంతో నిండిన మోరీలు కనిపించేవి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి ఊరిలో పచ్చని చెట్లు, కళకళలాడే రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కనిపిస్తున్నాయి. శంకర్పల్లి మండలంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పిల్లిగుండ్ల గ్రామంలో అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన చెట్లతో ఎంతో అందంగా ఆదర్శ గ్రామంగా తయారయ్యింది. ఇప్పటికే కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తయ్యాయి.
శుభ్రంగా రోడ్లు
పిల్లిగుండ్ల గ్రామంలో గతంలో చిన్న పాటి వర్షానికే రోడ్లు అన్ని గుంతల గుంతలుగా మారి వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నేడు గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లతో గ్రామం కళకళ లాడుతుంది.
పచ్చనిచెట్లు
గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో చూపరులను ఆకర్షించేలా ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామంలో ఆహ్లాదకర వాతావరణ నెలకొన్నది.
నర్సరీలు
గ్రామంలోని నర్సరీలో 20 రకాల మొక్కలు ఉన్నాయని, నర్సరీలో 18వేల మొక్కల పెంపకం చేపట్టారు. గ్రామం లో ఇప్పటికే మూడు వేల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ అయినప్పటికీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామాన్ని పచ్చతోరణం లాగా తయారు చేశాం. దాత వేణుగోపాల్రెడ్డి సహకారంతో గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు వేయించాం. ఇంకా పలు అభివృద్ధి పనులకు సహకరిస్తామని దాత వేణుగోపాల్రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మేల్యే కాలె యాదయ్య సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
– సత్యనారాయణరెడ్డి, పిల్లిగుండ్ల సర్పంచ్