కొందుర్గు, మే 19 : ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మారు మూల గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుంది. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు నిధులు ఖర్చు చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రామానికో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు లేకపోవడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాలు గమనించిన ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారి చేసింది. గ్రామంలో గల ప్రభుత్వ భూమిలో కానీ దాతలు ఇచ్చిన భూముల్లో ఈ వైకుంఠధామాలను ఏర్పాటు చేశారు.
పనులు పూర్తి
కొందుర్గు మండలంలోని 22 గ్రామాల్లో నూతనంగా వైకుంఠధామాలను ఏర్పాటు చేశారు. ఒక్కో వైకుంఠధామానికి రూ.12లక్షల 70వేల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలో వైకుంఠధామాల నిర్మాణం పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. కొందుర్గు మండలంలోని 22వైకుంఠధామాలకు 8 వైకుంఠధామాల్లో విద్యుత్ పనులు చేయాల్సి ఉంది. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని 24వైకుంఠధామాలకు 12వైకుంఠధామాల్లో విద్యుత్ పనులు చేయాల్సి ఉందని తెలిపారు.
నెల రోజుల్లో పనులు పూర్తి
కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని అన్ని గ్రామాల్లో గల వైకుంఠదామాలలో విద్యుత్ పనులు జరుగుతున్నాయి. నెల రోజుల్లో విద్యుత్ పనులు పూర్తి స్థాయిలో అవుతాయి. ప్రస్తుతం అన్ని వైకుంఠదామాలు వినియోగంలోకి తీసుకునేందుకు సిద్దంగ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్య ఉంది త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి.
– విజయ్కుమార్ పాల్ ఎంపీవో, కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలం