‘మన ఊరు-మన బడి’ ప్రక్రియ ఊపందుకున్నది. ఎంపిక చేసిన స్కూళ్లలో పనులను ప్రారంభించేందుకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. మొదటి విడుతకు జిల్లాలో 371 పాఠశాలలను ఎంపిక చేయగా.. చేపట్టాల్సిన పనులను ఇప్పటికే గుర్తించారు. ఇందులో మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీటి వసతి, ఫర్నిచర్, భవనాలకు రీపేర్లు, పెయింటింగ్, కిచెన్షెడ్లు, డైనింగ్హాల్స్, అదనపు తరగతి గదుల నిర్మాణం వంటివి ఉన్నాయి. వీటి కోసం సుమారుగా రూ.72.43 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. వీలైనంత త్వరలో పనులను ప్రారంభించి బడులు పునఃప్రారంభమయ్యేలోపు పూర్తి చేసే దిశగా ముందుకుసాగుతున్నారు.
పరిగి, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టే పనుల అంచనాలు పూర్తయ్యాయి. వికారాబాద్ జిల్లాపరిధిలో మొదటి విడుతలో 371 పాఠశాలలు ఎంపికయ్యాయి. ‘మన ఊరు-మన బడి’ కింద ఈ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఏ పనులు చేపట్టాలన్నది 5 ఇంజినీరింగ్ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి అంచనాలు తయారు చేశారు. 371 పాఠశాలల్లో 12 అంశాలకు సంబంధించిన పనులు చేట్టేందుకు సుమారు రూ.72.43 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు.
పనులవారీగా ఎస్టిమేట్లు
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో 12 అంశాలపై దృష్టి పెట్టనున్నారు. నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, మంచినీటి వసతి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, పాఠశాల భవనానికి పెయింటింగ్, మైనర్, మేజర్ రిపేర్లు, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీలు, కిచెన్షెడ్లు, అవసరమైనచోట అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాల్ల నిర్మాణం, డిజిటల్ విద్య అమలుకు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు. ఎంపికైన 371 పాఠశాలలను ఆయా మండలాలవారీగా పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ(ఆర్డబ్ల్యూఎస్), ఆర్అండ్బీ, టీఎస్ఈడబ్ల్యూఐడీపీ ఇంజినీరింగ్ శాఖలకు అప్పగించారు.
వారు తయారు చేసిన అంచనాలను మరోసారి ప్రతి పాఠశాలలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా ప్రతి పనికి సంబంధించి డిటెయిల్డ్ ఎస్టిమేట్లు వేయనున్నారు. ఇవి వెంటనే పూర్తిచేసి ఆయా పాఠశాలలవారీగా పనులు ప్రారంభించనున్నారు. పాఠశాలలోని అన్ని పనులను ఒక ప్రాజెక్టుగా పేర్కొంటూ, రూ.30లక్షలలోపు పనులన్నీ ఎస్ఎంసీ ద్వారా, మిగతావాటిని టెండర్ నిర్వహించి చేపట్టనున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ఎక్కువ పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు.
త్వరలోనే పనులు ప్రారంభం రేణుకాదేవి, వికారాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మొదటి విడుతలో ఎంపికైన 371 పాఠశాలల్లో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వాటిలో యుడైస్ ఆధారంగా పనులకు పూర్తిస్థాయి అంచనాలు తయారు చేస్తున్నారు. ఈ అంచనాల ఆధారంగా నిధులు వెచ్చించి పనులు చేపట్టనున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి సాధ్యమైనంత ఎక్కువ పనులు పూర్తయ్యేలా వేగంగా పనులు జరిగేలా చూస్తాం.
ప్రాథమిక అంచనాలు పూర్తి
వికారాబాద్ జిల్లా పరిధిలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టే పనులకు సంబంధించి ప్రాథమికంగా అంచనాలు పూర్తయ్యాయి. ఆయా పాఠశాలలవారీగా చేపట్టాల్సిన పనులు, వాటికెంత ఖర్చవుతుందన్నది ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి లైన్ ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారు.