బషీరాబాద్, మే 16 : విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందని, పంట దిగుబడికి విత్తనమే మూలాధారమని వ్యవసాయం తెలిసిన ప్రతి ఒక్కరూ పేర్కొంటారు. వ్యవసాయంలో విత్తన ఎంపిక, తయారు విధానం చాలా ప్రధానమని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని రకాల పంటలు ఇంటికి చేరి ఉన్నాయి. పంటలోంచి మంచి గింజలను (విత్తనాలు) వేరు చేసి విత్తేందుకు తయారు చేసుకోవాలి. ప్రభుత్వం, వ్యవసాయాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటునప్పటికీ అక్రమార్జనకు అలవాటు పడ్డ దోపిడీదారులు నకిలీ విత్తనాలతో మార్కెట్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. దీంతో అమాయకపు రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతున్నారు.
అక్రమార్కులు అందంగా ప్యాకింగ్ చేసిన నకిలీ విత్తనాలను రైతులకు అమ్ముతూ డబ్బులు పోగు చేసుకుంటున్నారు. వ్యాపారులను నమ్మి విత్తనాలు తీసుకెళ్లి పొలంలో విత్తితే అవి మొలకెత్తకపోవడంతో అన్నదాత అప్పుల పాలు అవుతున్నారు. ప్రతి సంవత్సరం విత్తనాలను కొనుగోలు చేయడంతో రైతులకు వ్యవసాయంలో ఖర్చు ఎక్కువగా వస్తున్నది. రైతులు నకిలీ విత్తనాలుకొని మోసపోకుండా ప్రభుత్వం గ్రామీణ విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నది. రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేందుకు అవసరమయ్యే మూల విత్తనాలను అందిస్తున్నది.
సొంత విత్తనంతో నాణ్యమైన పంట
ప్రస్తుతం అన్ని రకాల పంటలు చేతికి వచ్చాయి. రైతులు ప్రధానంగా విత్తన ఎంపికపైన దృష్టి పెట్టాలి. ప్రస్తుతం పండిన పంటలో వచ్చే సంవత్సరానికి అవసరమయ్యే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అందుకు గాను పండిన పంటలో నాణ్యమైన గింజలను సేకరించి వాటిన భద్రపర్చుకోవాలి. రైతులు స్వయంగా విత్తనాలను ఎంపిక చేసుకోవడంతో ఖర్చుతో పాటు నాణ్యమైన పంటను పండించవచ్చు. అంతే కాకుండా నకిలీ విత్తనాల భయం ఉండదు. అందుకే ప్రతి రైతు సొంతంగా విత్తనాలను ఎంపిక చేసుకోవడమే మేలని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా విత్తనోత్పత్తికి చేయూతను అందిస్తున్నది. విత్తన ప్రాధాన్యతను బట్టి అందుకు కావల్సిన మూల విత్తనాన్ని ప్రభుత్వం అందిస్తూ విత్తనోత్పత్తికి సహకరిస్తున్నది. పంట నుంచి సేకరించిన గింజలను శుభ్రం చేసి వాటిని బాగా ఎండలో ఎండబెట్టి ఇంట్లో దొరికే బూడిదను, వేప ఆకులను కలిపి ఒక సంచిలో(గన్ని) భద్రపర్చాలి. సంచిపైన చీమలు, క్రిమికీటకాలు రాకుండా వేప నూనె పిచికారీ చేయాలి.
నకిలీ విత్తనాలతో జాగ్రత్త
ప్రభుత్వం ఎంపిక చేసిన విత్తనాలనే కొనుగోలు చేసి పొలాల్లో విత్తుకోవాలి. నకిలీ విత్తనాలను విక్రయించేందుకు అక్రమార్కులు గ్రామాలనే ఎంపిక చేసుకుంటారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని నకిలీ విత్తనాలు కొని విత్తుతే మొలుకెత్తకపోవడమే కాకుండా ఆర్థికంగా నష్టం రావడంతో పాటు సమయం వృథా అవుతుంది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– విద్యాచరణ్రెడ్డి, ఎస్సై
ఎనుకటికి ఇంటి విత్తనమే వేసే వాళ్లం
ఎనుకటికి విత్తనాలను ఎవ్వరూ కూడా కొనేవాళ్లు కాదు. ఇంట్లో భద్రపర్చుకున్న విత్తనాలను పొలంలో విత్తేవాళ్లం దిగుబడి బాగా వచ్చేది. పంట పూర్తికాగానే విత్తనాల కొరకు మంచి గింజలను సేకరించి వాటిని శుభ్రం చేసి ఇంట్లో పెట్టేవాళ్లం. ప్రస్తుతం విత్తనాల నుంచి ఎరువుల దాకా ప్రతీది కొనుగోలు చేయడంతో ఖర్చు ఎక్కువగా వస్తున్నది.
– గౌసెబీ, మహిళా రైతు
సొంత విత్తనమే ఉత్తమం
రైతులు విత్తనాలను సొంతగా తయారు చేసుకోవడంతో ఖర్చుతో పాటు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండవచ్చు. సొంత విత్తనంతో నమ్మకంతో పాటు నాణ్యమైన పంటను పండించవచ్చు. కావునా రైతులు సాధ్యమైనంత వరకు సొంత విత్తనాల ఎంపికపై దృష్టి పెట్టాలి.
– చింతల రుద్రమూర్తి, తాండూరు డివిజన్