షాద్నగర్టౌన్, మే 16 : వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా పేరొందింది షాద్నగర్ పట్టణం. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో, ఎన్హెచ్ 44 సమీపంలో ఈ పట్టణం ఉంది. ఇక్కడికి అనునిత్యం వేలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. తిరిగి వెళ్లే సమయంలో చీకటి పడితే వారు సేదతీరేందుకు సరైన వసతులు లేవని గుర్తించి నైట్షెల్టర్ నిర్మాణ పనులను అధికారులు శరవేగంతో పూర్తి చేశారు. అన్ని రకాల హంగులతో నిర్మించిన ఈ భవన నిర్మాణానికి రూ. 46లక్షలు ఖర్చు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రయాణ మార్గంలో సేదతీరేందుకు ఈ నైట్షెల్టర్ భవనం ఎంతో ఉపయోగపడనున్నది. సేదతీరేందుకు వచ్చే ప్రజలందరికీ ఉపయోగకరంగా మారనున్నది. ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ కృషితో నైట్షెల్టర్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి కావడంపై పట్టణవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
వివిధ పనుల నిమిత్తం షాద్నగర్ పట్టణానికి ఎంతో మంది వస్తుంటారు. రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించారు. నైట్షెల్టర్ భవనం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-వినోద్కుమార్, విద్యార్థి షాద్నగర్
సంతోషంగా ఉంది
షాద్నగర్కు వచ్చే ప్రయాణికుల కోసం నైట్షెల్టర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా భవనాన్ని నిర్మించారు. ఇతర ప్రాంతాల ప్రయాణికులు, ప్రజలు రాత్రి సమయాల్లో సేదతీరేందుకు నైట్షెల్టర్ భవనం ఉపయోగపడుతుంది.
-శ్రీకాంత్, షాద్నగర్
పూర్తయిన నైట్షెల్టర్ భవనం
రాత్రి సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సేదతీరేందుకుగాను చేపట్టిన నైట్షెల్టర్ భవన నిర్మాణం పూర్తైంది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రయాణ మార్గంలో సేదతీరేందుకు ఈ భవనం ఉపయోగపడుతుంది. ఈ భవనాన్ని అన్ని మౌలిక వసతులతో నిర్మించాం. త్వరలోనే ప్రారంభిస్తాం.
-జయంత్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్