పరిగి, మే 16 : ఇండ్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల విధానాన్ని సులభతరం చేసేందుకు టీఎస్ బీపాస్ను జిల్లాలో అమలు చేయనున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు. సీఎం కేసీఆర్తో ఈ నెల 18న ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్ల సమావేశం సందర్భంగా.. జిల్లాలో చేపట్టిన పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, వరి ధాన్యం కొనుగోలు, అభివృద్ధి పనులపై సోమవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కోసం గ్రీన్ బడ్జెట్ నిధుల నుంచి రూ.11కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో 80 శాతం, గ్రామపంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. జిల్లాలో 80 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటివరకు 13 కేంద్రాల్లో 4222 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, ఫిజికల్ హెల్త్ ఈఈ ప్రభాకర్రెడ్డి, డీపీవో మల్లారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ నిఖిల సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి పలు సమస్యలపై 170 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. కొన్ని సమస్యలకు ఆప్షన్ రాలేదని, వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విజయకుమారి, అశోక్కుమార్, ల్యాండ్ సర్వే ఏడీ రాంరెడ్డి, ఏవో హరిత పాల్గొన్నారు.