రంగారెడ్డి, మే 16, (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా రంగారెడ్డి కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్ కేటుగాళ్లు పలువురిని డబ్బులు డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతోపాటు కొండాపూర్లోని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ఝాన్సీకి వాట్సాప్ నం.9054526206ద్వారా డబ్బులు కావాలని మెసేజ్ చేశారు.
రెండు నిమిషాల క్రితమే కలెక్టర్ అమయ్కుమార్తో మాట్లాడిన డీఆర్వో హరిప్రియ వెంటనే తన వాట్సాప్కు వచ్చిన మెసేజ్లకు సంబంధించి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్ అమయ్కుమార్.. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించి ఎవరూ స్పందించవద్దని జిల్లా అధికారులందరికీ సమాచారమందించారు. అదేవిధంగా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సైబర్ క్రైమ్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తన ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాతో ఎవరైనా డబ్బులడిగితే స్పందించవద్దని, సమాచారమివ్వాలని సూచించారు.