రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో ఏర్పాటైన ‘బృహత్’ వనాలు హాట్స్పాట్గా మారాయి. వాకింగ్ ట్రాక్లు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, పూల మొక్కలతో పాటు వివిధ రకాల పచ్చని మొక్కలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సాయంత్రమైతే చాలు చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా సేదతీరేందుకు జనం అధిక సంఖ్యలో వస్తుండడంతో ‘బృహత్’ వనాల్లో నెలకొంటున్నది. నందిగామ మండలం చేగూరు గ్రామంలో 10 ఎకరాల్లో రూ.34.82 లక్షల ఖర్చుతో మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. ఒక్కో ‘బృహత్’ వనంలో 20 నుంచి 30 వేల మొక్కలను నాటగా, ఏడాదిలోనే మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. ప్రతి బృహత్ పల్లె ప్రకృతి వనానికి ప్రభుత్వం రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు చేసింది. పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, ‘బృహత్’ వనాలతో పల్లెలన్నీ పచ్చందాలను సొంతం చేసుకున్నాయి.
రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. పల్లెలన్నీ పచ్చదనం, శుభ్రతతో రూపుదిద్దుకున్నాయి. గ్రామాల్లో పచ్చని చెట్లతో హరితశోభితను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పచ్చదనం దర్శనమిస్తున్నది. మరోవైపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజూ పారిశుధ్య నిర్వహణతోపాటు రోడ్లన్నీ శుభ్రం చేస్తుండడంతో శుభ్రంగా కనిపిస్తున్నాయి. చెత్తాచెదారం కనిపించకుండా ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా పంచాయతీ కార్మికులు సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చడం, నిరూపయోగంగా ఉన్న బావులను పూడ్చివేశారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో సర్కార్ తుమ్మ, జిల్లెడు వంటి కలుపు మొక్కలు, పెంట కుప్పలను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి పనులు చేపట్టారు. ప్రతినెలా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల నిధులను విడుదల చేస్తున్నది.
30వేల వరకు మొక్కల పెంపకం
తెలంగాణ అంతటా పచ్చదనం పరిఢవిల్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండలానికి ఒక బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కాగా, గ్రామానికి ఒక పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లెప్రగతి పనుల్లో భాగంగా ప్రతి మండలంలో ఐదు నుంచి పది ఎకరాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. 20నుంచి 30వేల మొక్కలను నాటారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయగా, వివిధ రకాల పూలు, పండ్ల, ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గతేడాది జూన్లో బృహత్పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం చిట్టడవులను తలపిస్తున్నాయి. పెద్ద, చిన్న తేడా లేకుండా ఈ వనాల్లో సేద తీరుతున్నారు.
పిల్లలు ఆడుకునేందుకు వస్తువులను ఏర్పాటు చేశారు. 31 రకాల ఔషధ మొక్కలను నాటారు. బృహత్ వనంలో నాటిన మొక్కల్లో చింత, వేప, కానుగ, గంగా రావి, నేరేడు, గోరింట, గుల్మార్, జామ, దానిమ్మ, సీతాఫలం, సీమచింత, క్లోరోడిండైన్, మునగ, ఎర్రగడ్డి, మర్రి, వెదురు, రావి, చురుగు, రైన్ చెట్టు, విప్ప, బొప్పాయి, షిశు, ఫిబ్రవరి ఫ్లవర్, బిల్వపత్రం, మేడి, గాంచుసీమ, టెకోమా, మద్ది, పనస, పెల్టోఫామ్, మారెడు మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. బృహత్వనాల ఏర్పాటుకు రూ.30 నుంచి 35 లక్షల మేర ప్రభుత్వం ఖర్చు చేసింది.
మోడల్గా చేగూరు బృహత్పల్లెప్రకృతివనం..
జిల్లాలో మోడల్గా నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో 10 ఎకరాల్లో బృహత్పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. చేగూరు బృహత్ పల్లెప్రకృతి వనానికి మొత్తం రూ.34.82 లక్షల నిధులను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఖర్చు చేశారు. పొడువు, పొట్టి, మధ్యస్త జాతి మొక్కలు కలిపి మొత్తం 23 వేల మొక్కలను నాటారు. వీటిలో పొడువు జాతి మొక్కలు 800, మిగతా 22,200 ఇతర జాతుల మొక్కలను నాటారు. పిల్లలు ఆడుకునేందుకుగాను ఎకరా స్థలంలో ఆటస్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. సేద తీరేందుకు కూడా చైర్లను ఏర్పాటు చేశారు.