తాండూరు రూరల్, మే 14 : అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై మధుసూదన్రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు మండలం, చెంగోల్ గ్రామానికి చెందిన బావనోళ్ల నర్సింహులు భార్య సంగీత(30) మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. తాగుడుకు బానిసైన నర్సింహులు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం రాత్రి పూట గొడవ చేస్తూ ఉండేవాడు. సంగీత బంధువులు ఇద్దరి విషయంలో చాలాసార్లు పంచాయితీ పెట్టి, సర్దిచెప్పారు. శుక్రవారం రాత్రి 10.40 గంటలకు భర్త నర్సింహులు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తాగిన మత్తులో భార్య సంగీతతో గొడవపెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నర్సింహులు బండరాయి తీసుకొని సంగీత తలపై బలంగా కొట్టాడు. దీంతో సంగీత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటిన గ్రామస్తులు తాండూరులోని జిల్లా దవాఖానకు తరలించారు. అప్పటికే సంగీత మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతురాలి తల్లి కుర్వ నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.