సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 13 (నమస్తే తెలంగాణ) : ఉనికి కోసం రాజకీయ ఆరాటం.. ఇష్టం వచ్చినట్లు ఝూటా మాటలు..తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకుంటున్న జనం ముందే రాష్ట్రంలో సంక్షేమమే లేదని బుకాయింపులు..ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర తీరు. ఒకవైపు జనం పట్టించుకోకున్నా పచ్చి అబద్ధాలు చెబుతూ యాత్రను కొనసాగిస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా సొంత పార్టీ నాయకులే తొండి బండికి ఝలక్ ఇస్తున్నారు. బండి పాదయాత్ర చేసిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. ఇంకెంతమంది పార్టీని వీడుతారోనని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు.
టీఆర్ఎస్లోకి పులిమామిడి సర్పంచ్, వార్డు సభ్యులు
రంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పార్టీ కేడర్కే పొగబెడుతున్నట్లుగా తయారైంది. కందుకూరు మండలంలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ అన్నది దేశమంతా తెలిసిన విషయం. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే స్వయంగా పథకాలను కొనియాడుతున్నారు. పలు రాష్ర్టాలు కూడా ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ జనాన్ని మభ్య పెట్టేందుకు బండి సంజయ్ సంక్షేమ పథకాలపై చేస్తున్న ఆరోపణలు బీజేపీని జనంలో మరింత చులకన చేస్తున్నాయి. దీంతో వాస్తవాన్ని గ్రహించిన పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు రాజకీయంగా అప్రమత్తమవుతున్నారు. ఇందులో భాగంగా బండి సంజయ్ పాదయాత్ర చేసిన పులిమామిడి గ్రామ బీజేపీ కేడర్ ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది.
గురువారం బండి యాత్ర ముగిసిన వెంటనే శుక్రవారం ఉదయం పులిమామిడి సర్పంచ్ వత్తుల అనితా శ్రీనివాస్, వార్డు సభ్యులు సహా 150 మందికి పైగా బీజేపీ గ్రామ నాయకులు,కార్యకర్తలు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరడం గమనార్హం. సాధారణంగా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటిస్తే ఆ ప్రాంత పార్టీ కేడర్లో నూతనోత్తేజం నిండాలి. కానీ ఇందుకు భిన్నంగా గంటల వ్యవధిలోనే సర్పంచ్, బీజేపీ శ్రేణులు టీఆర్ఎస్లోకి వెళ్లారంటే బండి మాటలను సాధారణ జనమే కాదు..చివరకు ఆ పార్టీ వాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్దఎత్తున అందుకుంటున్న జనం ముందు అవేవీ లేవంటూ అబద్ధాలు చెప్పడంపై కమలం పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నారు.