పరిగి, మే 13: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం అంచనాలను ధ్రువీకరించుకుని ప్రతిపాదనలను శనివారం అందజేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై మండలాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు అన్ని హంగులతో పనులను పూర్తి చేయాలన్నారు. పారదర్శకంగా ఉండేలా అవసరమై న అంచనాలను పరిశీలించి శనివారం సాయంత్రానికి అందజేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ కింద చేపట్టనున్న ప్రహరీలు, మరుగుదొడ్లు, వంటశాలల పనుల ప్రతిపాదనలను కూడా అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రేణుకాదేవి, మండలాల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
దోమలు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించి డెంగీని నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. జాతీయ డెంగీ డే సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఆమె పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తుకారాం, డీఈవో రేణుకాదేవి, వైద్యాధికారులు పాల్గొన్నారు.