కడ్తాల్, మే 13 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని జడ్పీటీసీ అనురాధ, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాతలను అన్ని విధాల ఆదుకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతన్నలు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని, దళారుల చేతి లో అన్నదాతలు మోసపోవద్దని అన్నారు. తేమ తక్కువ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1,940 ధరను నిర్ణయించిందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు వీరయ్య, శ్రీపాల్, వెంకటయ్యయాదవ్, ఏఎంసీ డైరెక్టర్లు రమేశ్, నిరంజన్, నాయకులు ఖలీల్, భాస్కర్, సీఈవో దేవేందర్, ఏఈవో సాయిరాం రైతులు పాల్గొన్నారు.