ఇబ్రహీంపట్నంరూరల్, మే 12 : ఎన్నో ఏండ్లుగా అధ్వానంగా ఉన్న తుర్కగూడ నుంచి కర్ణంగూడ, పోచారం మీదు గా కొంగరకలాన్ వరకు గల మట్టి రోడ్డు బీటీ రోడ్డుగా మారనుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరువతో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4.76 కోట్ల నిధులను మంజూరు చేసింది. కర్ణంగూడ-పోచారం గ్రా మాల మధ్యన ఉన్న వంతెన నిర్మాణాన్ని కూడా మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరువతో ఎమ్మెల్యే కిషన్రెడ్డి పూర్తి చేయించారు. అందులో భాగంగానే తులేకలాన్, కప్పాడు, తుర్కగూడ, కర్ణంగూడ, చర్లపటేల్గూడ గ్రామాల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, కూలీలు నిత్యం నగరానికి వెళ్తుంటారు. ఈ గ్రామాల ప్రజలు నగరానికి వెళ్లాలంటే ఇబ్రహీంపట్నం మీదుగా నగరానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించడానికి ఎమ్మెల్యే కిషన్రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. రోడ్డు నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టేందుకు అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరువతో ఈ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ 6 గ్రామాల రవాణా కష్టాలు తీరనున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరుగ్రామాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు నిర్మాణం చేపడుతామని ఉమ్మడి పాలకులు అనేకసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయారు. రోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.